
Ashok Sharma 150 kph Delivery: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. అయితే, ఇన్నింగ్స్ 17వ ఓవర్లో షాకింగ్ సీన్ కనిపించింది. అశోక్ శర్మ 150 కిలోమీటర్ల వేగంతో సంధించిన షార్ట్ పిచ్ బంతిని అంచనా వేయడంలో ముకుల్ చౌదరి విఫలమయ్యాడు. బంతి వేగానికి బౌన్సర్ నుంచి తప్పుకునే సమయం లేకపోవడంతో అది నేరుగా ముకుల్ హెల్మెట్ పైభాగాన్ని బలంగా తాకింది. దెబ్బకు బంతి గమ్యం మారి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్ళింది. పరుగు తీసినప్పటికీ, ఆ దెబ్బకు ముకుల్ ఒక్కసారిగా నివ్వెరపోయాడు. వెంటనే లక్నో వైద్య బృందం మైదానంలోకి వచ్చి అతనికి పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సొంత మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. మిచెల్ మార్ష్ 4 బంతుల్లో 11 పరుగులు చేసి వెనుదిరగ్గా, ఐడెన్ మార్క్రామ్ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా 18 పరుగులకే పరిమితమయ్యాడు. నికోలస్ పూరన్, ఆయుష్ బదోని వంటి హిట్టర్లు విఫలం కావడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది.
— crictalk (@crictalk7) April 12, 2026
లక్నో జట్టులో ముకుల్ చౌదరి అత్యంత కీలకమైన ఆటగాడిగా ఎదుగుతున్నాడు. గత మ్యాచ్లో కోల్కతాపై కేవలం 27 బంతుల్లో 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి అసాధ్యమైన విజయాన్ని అందించాడు. ఆ వేలం పాటలో లక్నో యాజమాన్యం ఇతని కోసం 2.60 కోట్ల రూపాయలను వెచ్చించింది. దేశవాళీ టోర్నీలో 200 పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించిన ముకుల్, వికెట్ కీపింగ్ కూడా చేయగల సామర్థ్యం ఉన్నవాడు. ఈ మ్యాచ్లో మాత్రం అతను 14 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు కీలక వికెట్లు తీసి లక్నో నడ్డి విరిచాడు. మహమ్మద్ సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేశాడు. 165 పరుగుల లక్ష్యం తక్కువగానే అనిపించినా, ఇకానా మైదానంలో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్న పని. లక్నో బౌలర్లు పవర్ ప్లేలో వికెట్లు తీస్తేనే మ్యాచ్పై పట్టు సాధించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..