కోపంతో ఊగిపోయిన కేకేఆర్ బ్రహ్మాస్త్రం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?

Angkrish Raghuvanshi Fined Bcci: కోల్‌కతా నైట్ రైడర్స్ యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ మైదానంలో ప్రదర్శించిన అసహనం అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ ఆటగాడిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనికి భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కోపంతో ఊగిపోయిన కేకేఆర్ బ్రహ్మాస్త్రం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?
Angkrish Raghuvanshi Fined Bcci
Image Credit source: https://x.com/HaryananewsPost

Updated on: Apr 27, 2026 | 3:08 PM

Cricket Disciplinary Action: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కోల్‌కతా ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో అంగ్క్రిష్ రఘువంశీ విచిత్రమైన రీతిలో అవుట్ అయ్యాడు. అంపైర్లు అతడిని ‘ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించడం’ (అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్) అనే నిబంధన కింద అవుట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఏమాత్రం ఏకీభవించని రఘువంశీ, మైదానంలోనే తన అసహనాన్ని ప్రదర్శించాడు. పెవిలియన్ వైపు వెళ్లే క్రమంలో ఆగ్రహంతో తన బ్యాట్‌ను బౌండరీ లైన్‌పై బలంగా కొట్టడమే కాకుండా, హెల్మెట్‌ను కూడా విసిరికొట్టాడు.

బీసీసీఐ కొరడా.. భారీ జరిమానా..

రఘువంశీ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ పాలక మండలి, అతను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినట్లు తేల్చింది. లెవల్ 1 నేరం కింద అతనికి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డిమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించింది. క్రికెట్ పరికరాలను దుర్వినియోగం చేయడం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మ్యాచ్ రెఫరీ విధించిన ఈ శిక్షను రఘువంశీ అంగీకరించాడు.

రికార్డుల్లో అపశ్రుతి..

ఈ అవుట్ ద్వారా రఘువంశీ ఐపీఎల్ చరిత్రలో ఒక అవాంఛిత రికార్డును మూటగట్టుకున్నాడు. ‘ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించడం’ ద్వారా అవుట్ అయిన నాలుగో ఆటగాడిగా అతను చరిత్రలో నిలిచాడు. సాంకేతిక కారణాలతో అవుట్ అవ్వడం ఒకెత్తు అయితే, కోపంతో ప్రవర్తనా నియమావళిని అతిక్రమించి శిక్షకు గురికావడం జట్టు యాజమాన్యాన్ని కూడా అసంతృప్తికి గురిచేసింది.

కేకేఆర్ తరపున ప్రదర్శన..

గత వేలంలో రూ. 3 కోట్లకు కోల్‌కతా జట్టులోకి వచ్చిన రఘువంశీ, మైదానంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 141.22 స్ట్రైక్ రేట్‌తో 209 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఆటతో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us