
Pakistan Airstrike : పొరుగు దేశాలైన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. సోమవారం పాకిస్థాన్ వైమానిక దళం అఫ్గానిస్థాన్పై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ముఖ్యంగా కాబుల్లోని ఒక మాదకద్రవ్య విముక్తి కేంద్రం లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ భీకర దాడిలో ఇప్పటివరకు కనీసం 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ దాడిపై అఫ్గానిస్థాన్ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ తీరును ఎండగట్టారు. “పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఇజ్రాయెల్ పాలనకు మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదు” అంటూ నవీన్ ఘాటుగా విమర్శించారు. మానవత్వం లేని దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ను ఆయన తీవ్రంగా నిరసించారు. గాయం కారణంగా ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న నవీన్, తన దేశ ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “సామాన్య ప్రజలు నివసించే ఇళ్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోవడం ముమ్మాటికీ యుద్ధ నేరమే. అది తెలిసి చేసినా, తెలియక చేసినా క్షమార్హం కాదు” అని రషీద్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ముఖ్యంగా పవిత్రమైన రమజాన్ మాసంలో ఇలాంటి ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరమని, ఐక్యరాజ్యసమితి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అఫ్గాన్ ప్రజలు ఎంతటి కష్టాన్నైనా తట్టుకుని మళ్ళీ నిలబడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Naveen Slams Pakistan Regime
Naveen Ul Haq’s Facebook post: “Hard to find any difference between Israel and the Pakistani regime period.”
Blasts airstrike on Kabul hospital amid #IranWar tensions.#NaveenUlHaq #Afghanistan #Airstrike pic.twitter.com/6cU1Mw6jOs
— MK Sharma ✍️ (@EmediaManoj) March 17, 2026
అయితే, ఈ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. తాము ఆసుపత్రిపై దాడి చేయలేదని, కేవలం ఉగ్రవాద స్థావరాలు, ఆయుధ గిడ్డంగులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని పాక్ సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసుపత్రిపై దాడి జరిగిందన్న వార్తలు తప్పుదోవ పట్టించేవేనని సమర్థించుకుంది. కానీ, క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం సామాన్య పౌరులే ఎక్కువగా బలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..