
Abhishek Sharma: దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా టీమిండియా వన్డే జట్టులో చోటు సంపాదించే అవకాశాన్ని అభిషేక్ శర్మ చేజార్చుకున్నారు. టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ యువ బ్యాటర్, వన్డే ఫార్మాట్లో మాత్రం తన సత్తా చాటలేకపోయాడు. ఇండియా ఏ వర్సెస్ దక్షిణాఫ్రికా ఏ మధ్య జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లో అభిషేక్ కేవలం 74 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
భారత క్రికెట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, యువ ఆటగాళ్లకు ఓపెనింగ్ స్థానంలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రోహిత్ శర్మ స్థానానికి యశస్వి జైస్వాల్ ప్రధాన పోటీదారుగా ఉన్నప్పటికీ, అభిషేక్ శర్మ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, ఈ సిరీస్లో విఫలమవడం ద్వారా అభిషేక్ తన స్థానాన్ని సంక్లిష్టం చేసుకున్నాడు.
ఈ సిరీస్లో అభిషేక్ శర్మ 3 మ్యాచ్ల్లో వరుసగా 31, 32, 11 పరుగులు చేశాడు. మొత్తం 3 ఇన్నింగ్స్లలో 24 సగటుతో కేవలం 74 పరుగులు మాత్రమే సాధించారు. ఆయన స్ట్రైక్ రేట్ 134గా ఉన్నప్పటికీ, వన్డే ఫార్మాట్లో అవసరమైన భారీ ఇన్నింగ్స్లు ఆడటంలో విఫలమయ్యాడు.
లిస్ట్ ఏ క్రికెట్ (వన్డే ఫార్మాట్)లో కూడా అభిషేక్ శర్మ రికార్డు అంత గొప్పగా లేదు. 65 ఇన్నింగ్స్లలో కేవలం 34 సగటుతో 2110 పరుగులు మాత్రమే చేశారు. టీ20 తరహాలోనే వన్డేల్లోనూ వేగంగా ఆడటానికి ప్రయత్నిస్తూ వికెట్ పారేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
రాబోయే టీ20 ప్రపంచ కప్లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారిన అభిషేక్, వన్డే జట్టులో స్థానం సంపాదించాలంటే తన బ్యాటింగ్ తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. కేవలం వేగంగా ఆడటమే కాకుండా, క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోర్లు సాధించడంపై దృష్టి పెట్టాల్సి ఉంది. లేదంటే టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కించుకోవడం అతనికి కష్టసాధ్యంగా మారే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..