Holi: శివుడి నుంచి శ్రీకృష్ణుడి వరకు ఇక్కడే.. హోలికా దహనం జరగని ఈ గ్రామం ప్రత్యేకత తెలుసా..?

Holika Dahan: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్‌పూర్ నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సి గ్రామం.. వేల ఏళ్ల నాటి ప్రత్యేక సంప్రదాయం వల్ల ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. దేశవ్యాప్తంగా హోలీ వేడుకల్లో భాగంగా హోలికా దహనం నిర్వహించడం ఆనవాయితీ అయినప్పటికీ.. బార్సి గ్రామంలో మాత్రం ఈ ఆచారం పాటించబడదు. గ్రామస్తుల విశ్వాసాలే దీనికి కారణం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Holi: శివుడి నుంచి శ్రీకృష్ణుడి వరకు ఇక్కడే.. హోలికా దహనం జరగని ఈ  గ్రామం ప్రత్యేకత తెలుసా..?
Holika Dahan

Updated on: Feb 28, 2026 | 4:17 PM

హోలీ పండగ సందర్భంగా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ హోలికా దహనం చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామం మాత్రం ఇప్పటి వరకు హోలికా దహనం మాత్రం నిర్వహించలేదు. అయితే, దీనికి చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. ఆ గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహారన్‌పూర్ నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సి గ్రామం.. వేల ఏళ్ల నాటి ప్రత్యేక సంప్రదాయం వల్ల ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. దేశవ్యాప్తంగా హోలీ వేడుకల్లో భాగంగా హోలికా దహన్ నిర్వహించడం ఆనవాయితీ అయినప్పటికీ.. బార్సి గ్రామంలో మాత్రం ఈ ఆచారం పాటించబడదు. గ్రామస్తుల విశ్వాసాలే దీనికి కారణం.

స్వయంభువుగా వెలిసిన శివలింగం

గ్రామ పశ్చిమ అంచున ఉన్న పురాతన శివాలయంలో స్వయంభువైన శివలింగం ప్రతిష్టించబడి ఉందని, అది మహాభారత కాలం నాటి సిద్ధ పీఠమని స్థానికులు భావిస్తారు. ఆ దేవాలయంలో పరమశివుడు స్వయంగా నివసిస్తున్నాడనే గాఢ నమ్మకం ఉంది. గ్రామంలో హోలికను దహనం చేస్తే ఆ అగ్నిజ్వాలలు శివుని పాదాలను తాకుతాయని, దాంతో అపశకునం సంభవిస్తుందని వారు విశ్వసిస్తారు. ఈ భక్తి భావంతోనే నేటికీ బార్సి గ్రామంలో హోలికా దహన్ నిర్వహించరు.

దుర్యోధనుడు నిర్మిస్తే.. భీముడు మార్చేశాడు..

గ్రామానికి సంబంధించిన జానపద కథలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక ప్రాచీన కథనం ప్రకారం, ఈ శివాలయాన్ని దుర్యోధనుడు నిర్మించాడని చెబుతారు. మరొక కథనం ప్రకారం, పాండవులలో శక్తివంతుడైన భీముడు ఈ ఆలయం కౌరవులు నిర్మించారని తెలుసుకుని, తన గదతో ప్రధాన ద్వారాన్ని కొట్టి తూర్పు దిశ నుంచి పడమరకు తిప్పాడట. అందువల్లే ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉన్న శివాలయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

శ్రీకృష్ణుడి సందర్శన

ఇంకా ఒక విశ్వాసం ప్రకారం.. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తూ ఈ గ్రామంలో ఆగాడని చెబుతారు. ఈ కారణంగా గ్రామానికి మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏర్పడిందని స్థానికులు భావిస్తున్నారు. కాలక్రమేణా ఈ విశ్వాసాలన్నీ గ్రామ చరిత్రలో భాగమై, బార్సి అనే పేరుతో అది ప్రసిద్ధి చెందింది.

హోలీని సంబరంగా జరుపుకుంటారు కానీ..

హోలీ పండుగను మాత్రం గ్రామస్తులు ఎంతో ఆనందంగా, సోదరభావంతో జరుపుకుంటారు. రంగులు, గులాల్‌తో ఉత్సవం ఘనంగా సాగుతుంది. అయితే హోలికా దహన్ కోసం గ్రామంలోని వివాహిత మహిళలు, కుమార్తెలు సమీప గ్రామాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. తమ గ్రామంలో మాత్రం ఆ అగ్నికార్యాన్ని చేపట్టరు.

కాలం మారినా, ఆధునికత పెరిగినా, బార్సి గ్రామం తన సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తోంది. హోలీ ఉత్సాహంలోనూ శివుని పట్ల ఉన్న భక్తి, విశ్వాసం చెదరని విలువగా నిలుస్తోంది. అందుకే హోలికా దహన్ చేయకుండా హోలీ జరుపుకునే ఈ ప్రత్యేక సంప్రదాయం బార్సి గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

Follow Us