
ఆహారాన్ని భగవంతుని స్వరూపంగా, ప్రసాదంగా భావించాలి. కానీ, మారుతున్న జీవనశైలిలో చాలా మంది మంచం మీద కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేయడం లేదా ఒకే కంచంలో తినడం వంటివి చేస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అన్నపూర్ణ దేవిని అవమానించడమే అవుతుంది. ఒకే ప్లేట్లో భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అసూయ అశాంతి ఎందుకు పెరుగుతుందో.. అలాగే మంచం మీద తినడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఎందుకు తప్పుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
భోజన నియమాలు – వాస్తు శాస్త్రం చెప్పే నిజాలివే:
ఒకే ప్లేట్లో భోజనం: భార్యాభర్తలు ఒకే కంచంలో తినడం వల్ల భర్తకు భార్యపై మితిమీరిన ప్రేమ పెరుగుతుందని, దీనివల్ల అతను కుటుంబంలోని ఇతర సభ్యుల పట్ల తన బాధ్యతలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుందని వాస్తు చెబుతుంది. ఇది కుటుంబంలో వివక్షకు, తద్వారా అసూయ తగాదాలకు దారితీస్తుంది. ఫలితంగా ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.
మంచం మీద భోజనం: నిద్రించే మంచం మీద కూర్చుని తినడం చాలా అశుభం. ఇది అన్నపూర్ణ దేవిని, లక్ష్మీ దేవిని అవమానించినట్లే అవుతుంది. ఇలా చేయడం వల్ల ఆర్థిక అస్థిరత ఏర్పడి, పేదరికం వచ్చే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.
ఆర్థిక సమస్యలు: అపరిశుభ్రమైన ప్రదేశంలో లేదా క్రమశిక్షణ లేని పద్ధతిలో భోజనం చేయడం వల్ల ఇంట్లో సానుకూలత తగ్గి, అనవసర ఖర్చులు ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి.
శాంతి శ్రేయస్సు కోసం చిట్కాలు:
ఎల్లప్పుడూ కింద కూర్చుని లేదా డైనింగ్ టేబుల్ వద్ద క్రమశిక్షణతో భోజనం చేయండి.
భోజనానికి ముందు దైవానికి కృతజ్ఞతలు చెప్పడం వల్ల ఇంటికి అదృష్టం వస్తుంది.
భోజనం చేసే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఆహార నియమాలు వాస్తు నమ్మకాలు అనేవి వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి.