శంబర వీధుల్లో సిరమాను సంబరం.. అమ్మవారి ప్రతిరూపాన్ని కొలుస్తూ పులకించిన భక్తజనం.. ప్రధాన ఘట్టాలు ఇవే..!

|

Jan 25, 2023 | 8:31 AM

జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శంబర పోలమాంబ జాతర సంక్రాంతి తర్వాత మొదటి వారం నుంచి..

శంబర వీధుల్లో సిరమాను సంబరం.. అమ్మవారి ప్రతిరూపాన్ని కొలుస్తూ పులకించిన భక్తజనం.. ప్రధాన ఘట్టాలు ఇవే..!
Polamamba Jatara
Follow us on

పార్వతీపురం మన్యం జిల్లా శంబరలో పోలమాంబ జాతర అంగరంగ వైభవంగా సాగింది. లక్షలాదిమంది భక్తులు వీక్షిస్తుండగా అమ్మవారి సిరిమాను శంబర వీధుల్లో ఊరేగింది. 60 అడుగుల ఎత్తున సిరిమానుపై ప్రధాన అర్చకుడు జన్నిపేకాపు రామారావు ఆశీనులవ్వగా భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావించి సిరిమానును దర్శించుకుని పునీతులయ్యారు. ముందు రామారావును చదురు గుడి నుంచి సాడేపు కుటుంబీకులు మోసుకొని వచ్చారు. అనంతరం సిరిమానును అధిరోహించారు. అప్పటికే మంగళ వాయిద్యాల మధ్య ఘటాలు సిరిమాను దగ్గరకు వచ్చాయి. సిరిమాను తొలుత గిరడ వారింటికి, అనంతరం కుప్పిలి, పూడి వారిళ్లకు వెళ్లి పూజలు అందుకుంది.

ఆ తర్వాత ఘటాలు దక్షిణ దిక్కుగా, సిరిమాను తూర్పు దిక్కుగా వెళ్లాయి. రెండు పణుకు వీధిలో కలిశాయి. అక్కడ పొడిపిరెడ్డి కుటుంబీకులు, తీళ్ల వారి వారసులుగా అక్యాన కుటుంబీలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిరిమాను మళ్లీ గొల్లవీధి, కొత్తవీధి మీదుగా పెద్దమ్మ గుడి దగ్గరకు చేరుకుంది. అక్కడ భక్తుల పూజలు అందుకుంది. ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, చత్తీస్‌ఘడ్, ఒడిస్సా నుండి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శంబర పోలమాంబ జాతర సంక్రాంతి తర్వాత మొదటి వారం నుంచి పది వారాల వరకు జరుగుతుంది. శంబర వీధుల్లో అమ్మవారి సిరిమాను మూడుసార్లు తిరగడంతో ఉత్సవం ముగిసింది.

పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగియటంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 28న చండీహోమం, 31న మారు జాతర నిర్వహిస్తారు. ప్రధాన ఘట్టలైన తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం, అంపక ఉత్సవాలకు సైతం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..