Uttar pradesh: వారణాసిలో వర్షబీభత్సం.. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో పిడుగుపడి ఆలయ శిఖరం ధ్వంసం!
సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో భారీ వర్షంతో మెరుపులు మెరిశాయి. ఆ సమయంలో కాశీ విశ్వనాథ ధామ్, సమీపంలోని ఆలయాలలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. బాబా మాంధాతేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆరతికి సమయం దగ్గరపడింది.

వారణాసిలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా కాశీ విశ్వనాథ ఆలయ సముదాయంలోని భారత మాత విగ్రహం సమీపంలో గల మాంధాతేశ్వర్ మహాదేవ్ ఆలయంపై పిడుగు పడింది. పిడుగు దాటికి ఆలయ శిఖరంపై గల కలశం ధ్వంసమైంది. పిడుగుపాటు కారణంగా శిఖరం పైభాగం దెబ్బతింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం క్షీణించింది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో భారీ వర్షంతో మెరుపులు మెరిశాయి. ఆ సమయంలో కాశీ విశ్వనాథ ధామ్, సమీపంలోని ఆలయాలలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. బాబా మాంధాతేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆరతికి సమయం దగ్గరపడింది. పూజారులు హారతి కోసం అంతా సిద్ధం చేశారు. అంతలోనే పెద్ద శబ్దంతో బాబా మాంధాతేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎగువ శిఖరంపై పిడుగు పడింది. పిడుగు ధాటికి ఆలయం ఎగువ శిఖరం దెబ్బతింది. గుడి ఆవరణలో చుట్టూ పిడుగుపాటు కారణంగా శిఖరం రాళ్లు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. కానీ, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం సంభవించకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు, ఆలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై శిథిలాలను తొలగించారు.

వర్షం ప్రారంభమైన తర్వాత భక్తులు విశ్రాంతి గృహాలు, ఆలయం లోపలి ప్రాంగణంలోకి వెళ్లారు. దాంతో పిడుగుపడిన సమయంలో అందరూ తప్పించుకున్నారని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కుమార్ వర్మ తెలిపారు. పిడుగుపాటుకు భయంతో గుడి చుట్టూ భక్తులు ఎక్కడివారు అక్కడే పరుగులు తీశారు. అయితే, ఆలయ శిఖరం మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయనున్నారు అధికారులు. పిడుగు పడిన సమయంలో శబ్ధాలకు ఆ ప్రాంతమంతా నివ్వెరపోయింది. భక్తులు గానీ, ఆలయ సేవకులు గానీ, అర్చకులు, ఉద్యోగులు, అధికారులు గానీ ఏ ఒక్కరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడ్డారంటే..అది కేవలం ఆ కాశీవిశ్వనాధుడి మహిమగానే చెబుతున్నారు భక్తులు, ఆలయ అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి