
తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి నిర్వహించిన ధ్వజావరోహణంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులకు తిరుమలకు చేరుకున్నారు. భక్తులందరూ శ్రీవారి 16 వాహన సేవలతో పాటు మూలమూర్తిని దర్శనం చేసుకున్నారని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు చెప్పారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8 రోజుల్లో 5.80 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.25.12 కోట్లు హుండీ ఆదాయం లభించింది. 26 లక్షల మంది పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారికి 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తుల విక్రయించారు. ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 4.40లక్షల మంది భక్తులు.. తిరుమల నుంచి తిరుపతికి 5.22 లక్షల మంది భక్తులు ప్రయాణించారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
అంతేకాదు స్వామివారికి ఖమ్మం కు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు టెక్స్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ అంకిత్ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని (స్విమ్స్) పథకానికి గురువారం రూ.30 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు చెక్కును అందజేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..