తిరుమల కొండల్లో దాదాపు రెండువేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అకేసియా చెట్టను తొలగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. సప్తగిరుల్లో కనుచూపుమేరా కనిపించే పచ్చదనానికి కారణం ఈ అకేషియా చెట్లే. అంతటి పచ్చదనాన్ని పంచుతున్న అకేషియా చెట్లను నరికివేసేందుకు TTD ఎందుకు నిర్ణయం తీసుకుంది? అసలు అకేషియా చెట్లను నరకాల్సిన అవసరమేంటి? అకేషియా చెట్ల వల్ల జీవవైవిధ్యం దెబ్బతినడంతో పాటూ.. చెట్ల కింద భూసాంద్రత దెబ్బతింటోందని స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు పరిశోధనలో తేలింది.
చెట్ల కింది పీహెచ్ 4.5 శాతానికి చేరుకుని భూమిలో ఆమ్లాల శాతం కూడా ఎక్కువవుతోందని పరిశోధనలో గుర్తించింది బయోడైవర్సిటీ బోర్డు. వారు TTD కి ఓ నివేదిక అందించడంతో ఈ విషయంపై TTD ఆలోచనలో పడింది. దాదాపు రెండువేల ఎకరాల్లో ఉన్న చెట్లను నరికివేయడమంటే మామూలు విషయం కాదు. కానీ అకేషియా చెట్ల వల్ల జంతువులకు కలుగుతున్న ఇబ్బందులు, జీవవైవిధ్యానికి కలుగుతున్న నష్టాన్ని గ్రహించిన TTD అధికారులు ఈ అంశాన్ని గత పాలక మండలిలో చర్చించారు.
అకేసియా (తుమ్మ) ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి ఫాబేసి (Fabaceae) కుటుంబంలోని అకేసియా (Acacia) ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగులో ఉండే పువ్వులు కలిగి యుంటాయి.
తిరుమల ఘాట్ రోడ్ల దగ్గర నుండి తిరుమల క్షేత్రం చుట్టూ దాదాపు రెండు వేల ఎకరాల్లో అకేషియా చెట్లు విస్తరించి ఉన్నాయి. వీటిని విడతలవారీగా పదేళ్లలోపు తొలగించాలని TTD పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ చెట్లకు ప్రత్యామ్నాయంగా అకేషియా చెట్లు తొలగించిన ప్రాంతాల్లో పురాణాల్లో విశేషంగా వర్ణించబడిన చెట్లను పెంచాలని నిర్ణయించారు. 15 నుంచి 20 రకాల మొక్కలను ఎంపిక చేసి అకేషియా చెట్లను తొలగించిన ప్రాంతాల్లో పెంచాలని TTD నిర్ణయం తీసుకుంది.