Medaram Jathara: మేడారం జాతరలో బెల్లమే నిలువెత్తు బంగారం.. ఎందుకో తెలుసా?

సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు బంగారంగా పిలిచే బెల్లమే అమ్మవార్లకు నైవేద్యమవుతుంది. ఇలా నిలువెత్తు బెల్లాన్ని సమర్పించడం వెనుక ఎన్నో ఏళ్ల ఆనవాయితీ ఉంది. మినీ మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు వనదేవతలకు తీసుకెళ్లే ఈ నైవేద్యానికి ఎంతో మహిమ ఉందని చెప్తారు. అమ్మవార్లే బంగారం రూపంలో భక్తులను ఆశీర్వదిస్తారని నమ్ముతారు.

Medaram Jathara: మేడారం జాతరలో బెల్లమే నిలువెత్తు బంగారం.. ఎందుకో తెలుసా?
Mini Medaram Jathara

Updated on: Feb 13, 2025 | 3:02 PM

కోరిన భక్తుల కొంగు బంగారం.. అతిపెద్ద ఆదివాసీ జాతర మళ్లీ మొదలైంది. వన దేవతల దర్శనం కోసం రాష్ట్రవ్యాప్తంగా భక్తులు మినీ మేడారం జాతరకు బయలుదేరి వెళ్తున్నారు. చల్లని తల్లులకు బంగారాన్ని గుట్టలుగా పోగుచేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. అదేనండి.. మేడారం జాతరలో బెల్లాన్నే బంగారంగా పిలుస్తారు. సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి కనీసం చిటికెడు బెల్లాన్నైనా ప్రసాదంగా తెచ్చుకోవాలని భక్తులు పోటీ పడుతుంటారు. ఎక్కడైనా దేవుళ్లకు నైవేద్యంగా పండ్లు, పదార్థాలను పెడుతుంటారు. బంగారాన్ని నైవేద్యంగా స్వీకరించే ఏకైక జాతర మేడారం మాత్రమే. వీటితో పాటు సమ్మక్క సారలమ్మలకు చీర, గాజులు, పసుపు కుంకుమలు చెల్లించి చల్లగ చూడమని వేడుకుంటారు. పూర్వం గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ పండుగకు ఇప్పుడు ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. వచ్చిన వారంతా అమ్మవార్లకు బంగారాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఇంతకీ మేడారంలో బెల్లం సమర్పించే సంప్రదాయం ఎప్పటినుంచి మొదలైంది. అమ్మవార్లకు నైవేద్యంగా బెల్లం మాత్రమే ఎందుకు పెడతారు? ఈ బెల్లాన్ని బంగారంగా ఎందుకు పిలుస్తారనే విషయాల వెనుక ఆసక్తికర అంశాలున్నాయి. అవేంటో చూసేయండి..

బంగారం కంటే విలువైనది..

పూర్వం గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ జాతరకు ఇప్పుడు కోట్లాదిగా భక్తులు వస్తున్నారు. అయితే, జాతరకు వెళ్లేదారిలో దప్పిక, నీరసం రాకుండా బలవర్ధకమైన బెల్లాన్ని తమ వెంట తీసుకువెళ్లేవారు. గిరిజనులు ఎంతో ఇష్టంగా తీసుకునే బెల్లాన్నే అమ్మవార్లకు కూడా నైవేద్యంగా సమర్పించేవారు. వారు భక్తి శ్రద్ధలతో సమర్పించే ఈ నైవేద్యమే ఆ వనదేవతలకు బంగారంతో సమానంగా భావిస్తారని విశ్వశిస్తారు. బెల్లానికి అడవి బిడ్డలు ఎంతో ప్రాధాన్యాన్నిస్తారు. అమ్మవార్లకు సమర్పించేది కాబట్టి దీనినే కాలక్రమేణా బంగారంగా పిలువడం మొదలైందని చెప్తారు.

కాకతీయుల కాలం నుంచే..

కాకతీయుల కాలం నుంచే అమ్మవార్లకు ఇక్కడ బెల్లం సమర్పించడం జరుగుతుంది. పూర్వం చాలా దూరం నుంచి భక్తులు ప్రయాణించి ఎడ్ల బండ్ల మీదకెళ్లి వచ్చి అమ్మవార్ల దగ్గరికి చేరుకునేవారట. ఇక్కడే వారం లేదా పది రోజులు ఉండేవారట. ఆకలి వేసినప్పుడు త్వరగా శక్తిని అందించే బెల్లం పానకంతో తయారు చేసే ఆహారాన్ని తీసుకునేవారట. అందుకే అది అప్పటినుంచి చాలా విలువైనదిగా భావించి.. సమ్మక్క-సారలక్కకు సమర్పించడం ప్రారంభమైందని స్థానికులు చెబుతారు.

మొక్కుతీరితే నిలువెత్తు బంగారం..

భక్తులది ఎంత పెద్ద కష్టమైనా సరే.. ఆ తల్లలకు చెప్పుకుంటే తీరుతుందని అంటారు. అలా కోరిన కోరికలు తీరిన వెంటనే ఆ మనిషికి నిలువెత్తు బంగారాన్ని దేవతల గద్దెలపై ఉంచి మొక్కులు చెల్లిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us