Tirumala: తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు.. ఎప్పటి నుంచి ఎందుకో తెలుసా..!

| Edited By: Balaraju Goud

Aug 22, 2024 | 5:02 PM

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది.

Tirumala: తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు.. ఎప్పటి నుంచి ఎందుకో తెలుసా..!
Tirumala Temple
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్‌ చూపిస్తున్నారు శ్యామలరావు. సీఎం ఆదేశాలతో తిరుమల కొండపై ప్రక్షాళన చేపట్టారు. ముప్పై రోజుల పాటు వరుస తనీఖీలు నిర్వహించారు. తిరుమల పవిత్ర దగ్గర నుంచి.. భక్తుల దర్శన సమస్యల వరకు. లడ్డూ క్వాలిటీ మొదలుకుని.. ఐటీ లోపాల వరకు. ఇలా అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తాజాగా తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో స్వామి వారి వాహన సేవలు వీక్షించేందుకు తిరుమలకు సామాన్య భక్తులు సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని భావిస్తున్న టీటీడీ, ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగానే బ్రహ్మోత్సవాలు కు అంకురార్పణ జరిగే
అక్టోబరు 3 నుండి 12 చక్రస్నానం నిర్వహించేంత వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను సైతం టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని టీటీడీ కోరుతోంది.

ఇదిలావుంటే, శ్రీవారి దర్శన టికెట్‌ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని టీటీడీ గుర్తించింది. ఆన్‌లైన్‌ సేవా టికెట్లు, దర్శనం టికెట్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. అలా చేయడం వల్ల అక్రమాలు అరికట్టవచ్చని భావిస్తున్నారు. అలాగే టీటీడీకి వెన్నుముకగా ఉన్న ఐటీ వ్యవస్థను వేగవంతం చేసేందుకు జియో, టిసిఎస్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో తిరుమల మరింత కొత్తగా కనిపించడం ఖాయమంటున్నారు ఈవో శ్యామలరావు. తిరుమల పవిత్రతను కాపాడుతూనే.. అద్భుత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈవో.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..