
2025 సంవత్సరంలో నాలుగు గ్రహణాలు సంభవించబోతున్నాయి. వాటిలో 2 ఇప్పటికే సంభవించాయి. మొదటి చంద్రగ్రహణం మార్చి 14న సంభవించగా.. సూర్యగ్రహణం మార్చి 29న సంభవించింది. అయితే ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో కనిపించలేదు. ఇప్పుడు ప్రజలు తదుపరి రెండు గ్రహణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తదుపరి గ్రహణాలు భారతదేశంలో కనిపిస్తాయో లేదో తెలుసుకోవడానికి కూడా ఆసక్తిగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? భారతీయులు ఆ ఖగోళ సంఘటనను చూడగలరా లేదా తెలుసుకుందాం..
ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం 2025 సెప్టెంబర్ 21న అమావాస్య రోజున ఏర్పడుతుంది. ఈ గ్రహణం సెప్టెంబర్ 21న రాత్రి 11 గంటల నుంచి సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 3:24 గంటల వరకు ఉంటుంది, అంటే ఈ సూర్యగ్రహణం మొత్తం 4 గంటల 24 నిమిషాల పాటు ఉంటుంది.
మొదటి గ్రహణం లాగే ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.
హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యుడు లేదా చంద్రుడు గ్రహణం ప్రభావంలో ఉన్నప్పుడు.. వాటి శక్తి తగ్గుతుంది. దీని కారణంగా ఈ కాలంలో చేసే ఏదైనా పూజ లేదా శుభకార్యం ఫలించకపోవచ్చు. కనుక హిందూ మతంలో గ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. గ్రహణం సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి మరింత చురుగ్గా ఉంటుందని, దీనివల్ల సానుకూల శక్తి బలహీనపడుతుందని నమ్ముతారు. ఈ కారణంగా.. గ్రహణ సమయంలో చేసే పూజలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు.
సూతక కాలంలో ఎటువంటి శుభకార్యాలు లేదా పూజలు చేయకూడదు.
సూతక కాలంలో పవిత్ర మత గ్రంథాలను అధ్యయనం చేయాలి.
సూతక కాలంలో భగవంతుడిని ధ్యానించి, మంత్రాలను జపించాలి.
సూతక కాలంలో గర్భిణీ స్త్రీ బయటకు వెళ్లకూడదు.
సూతక కాలం ప్రారంభమయ్యే వరకు ఆహారం వండకూడదు లేదా తినకూడదు.
గ్రహణానికి ముందు తయారుచేసిన ఆహారాన్ని తులసి దళాలతో లేదా దర్భ వేసి ఉంచాలి.
సూతక కాలం ముగిసిన తర్వాత ఇంట్లో గంగా జలాన్ని చల్లుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.