Prayagraj: బడే హనుమాన్ ఆలయంలోకి ప్రవేశించిన గంగ నీరు.. తాత్కాలికంగా మూసివేత.. యధావిధిగా పూజలు..

త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్ రాజ్ సమీపంలో అనేక దేవాలయాలున్నాయి. అటువంటి ప్రసిద్ద ఆలయాల్లో ఒకటి బడే హనుమాన్ ఆలయం. ఈ ఆలయంలో హనుమంతుడు శయనించి ఉంటాడు. త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించిన భక్తులు ఈ హనుమాన్ ఆలయాన్ని తప్పని సరిగా దర్శించాలని ఈ ఆలయానికి సంబంధించిన విశ్వాసం. ప్రస్తుతం వరద నీరు హనుమాన్ ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించింది. దీంతో ఈ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Prayagraj: బడే హనుమాన్ ఆలయంలోకి ప్రవేశించిన గంగ నీరు.. తాత్కాలికంగా మూసివేత.. యధావిధిగా పూజలు..
Bade Hanuman Temple

Updated on: Jul 17, 2025 | 10:04 AM

గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం ప్రయాగ్ రాజ్.. త్రివేణీ సంగమ ప్రాంతంలో గంగాస్నానం చేయడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ సమీపంలో ఉన్న బడే హనుమాన్ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటారు. ఇక్కడ హనుమాన్ ను దర్శించుకోకపోతే త్రివేణి సంగమంలో చేసిన గంగా స్నానం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా రెండు నదులలో నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతూ ఉండడంతో ప్రయాగ్‌రాజ్, వారణాసితో సహా ఉత్తరప్రదేశ్‌లోని అనేక నగరాల్లో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ప్రయాగ్ రాజ్ లో గంగా, యముననదుల్లోని నీటి మట్టాలు పెరగడంతో ఈ నదుల వరద నీరు బడే హనుమాన్ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. హనుమంతుడిని ముంచెత్తడంతో ఈ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

భక్తి, ప్రకృతి శక్తితో కలిసే అద్భుతమైన దృశ్యం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంలోని (ఉత్తరాదివారికి) మొదటి మంగళవారం కనిపించింది. నీటి ప్రవాహం పెరుగుతున్నప్పటికీ ఆలయ పూజారులు హారతి (దీపపూజ) అభిషేకం (దేవునికి ఆచారబద్ధంగా స్నానం చేయడం) వంటి పవిత్ర ఆచారాలను నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

సోమవారం రెండు నదుల నుంచి వచ్చిన నీరు ఆలయ కారిడార్ ముందు ఉన్న రహదారిని ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి బడే హనుమాన మందిర కారిడార్‌కు వెళ్లే రహదారిని వరద నీరు ముంచెత్తింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఆలయ మెట్లపై నుంచి నీరు ప్రవహించడం ప్రారంభమైంది. హనుమంతుడి శయన విగ్రహం మునిగిపోయింది. ఆలయ ప్రధాన గదిని సాధారణ ఆచారాల కోసం మూసివేశారు. వరద నీరు తగ్గే వరకు పూజ కోసం ఆలయం పైన హనుమంతుడి చిన్న విగ్రహాన్ని ఉంచారు.

“మహాస్నానం” లేదా దేవుళ్ళకు నిర్వహించే పవిత్ర స్నానం అని పిలువబడే పవిత్ర కార్యక్రమాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు.

అయితే సర్వసాధారణంగా ఆగష్టు నెలలో గంగా, యమునల వరద నీరు బడే హనుమాన్ ఆలయానికి చేరుకుంటాయి. అయితే ఈ ఏడాది ముందుగానే అంటే జూలై నెల మధ్యలోనే వరదనీరు ఆలయంలోకి చేరుకుంది.

గంగా, యమునా నదుల వరదలు

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో గంగా నది ప్రస్తుతం 177.60 మీటర్ల నీటి మట్టం వద్ద ప్రవహిస్తోంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని 16 వరద నియంత్రణ పోస్టులను ఏర్పాటు చేసిందని, అలాగే ప్రభావిత ప్రాంతాల్లో 13 షెల్టర్ హోమ్‌లను ఏర్పాటు చేసినట్లు సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా తెలిపారు.

Follow Us