AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mana Village: మానా.. భారతదేశపు తొలి గ్రామంగా గుర్తింపు పొందిన ఈ ఊరి విశేషాలు తెలుసా?

India First Village Mana: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌కు సమీపంలో ఉన్న మానా గ్రామం పురాణాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, హిమాలయ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. గతంలో ‘భారతదేశపు చివరి గ్రామం’గా పిలిచిన ఈ ప్రాంతం ఇప్పుడు ‘తొలి గ్రామం’గా గుర్తింపు పొందింది. మానా గ్రామం ప్రత్యేకతలు, భీమ్ పుల్, వ్యాస్ గుహ, సరస్వతీ నది, వసుధారా జలపాతం వంటి ఆకర్షణల గురించి తెలుసుకుందాం.

Mana Village: మానా.. భారతదేశపు తొలి గ్రామంగా గుర్తింపు పొందిన ఈ ఊరి విశేషాలు తెలుసా?
India First Village Mana
Rajashekher G
|

Updated on: Aug 22, 2026 | 11:28 AM

Share

India First Village Mana: ప్రయాణాలను ఇష్టపడేవారి కోసం భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక విశేషాలు, చారిత్రక ప్రాధాన్యత కలగలిసిన ప్రదేశాల్లో ఉత్తరాఖండ్‌ ప్రత్యేకమైనది. అందుకే ఈ రాష్ట్రాన్ని ‘దేవభూమి’ అని పిలుస్తారు. నైనిటాల్, మసూరీ వంటి ప్రసిద్ధ హిల్‌స్టేషన్లతో పాటు, పురాణాలు, చరిత్రతో ముడిపడి ఉన్న ఎన్నో ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. అలాంటి ప్రత్యేక ప్రదేశాల్లో మానా గ్రామం ఒకటి. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో, బద్రీనాథ్ ధామ్‌కు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామం ప్రకృతి అందాలకు మాత్రమే కాకుండా, చారిత్రక, ఆధ్యాత్మిక, పౌరాణిక విశేషాలకు కూడా ప్రసిద్ధి చెందింది. భారత-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ గ్రామాన్ని గతంలో ‘భారతదేశపు చివరి గ్రామం’గా పిలిచేవారు. ప్రస్తుతం ‘భారతదేశపు తొలి గ్రామం’గా గుర్తింపు పొందింది.

మానా గ్రామానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత

మానా గ్రామం మహాభారత కాలం నాటి పౌరాణిక కథలతో ముడిపడి ఉందని స్థానిక విశ్వాసాలు చెబుతున్నాయి. పాండవులు స్వర్గారోహణం కోసం ప్రయాణించిన సమయంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లారని నమ్మకం ఉంది. అందుకే హిందువులకు ఈ గ్రామం ఎంతో పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. మానా పరిసరాల్లో సరస్వతీ నది ప్రవాహం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ సరస్వతీ నది పర్వతాల మధ్య నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోని పురాణ గాథలు, దేవాలయాలు, గుహలు, నదీ ప్రవాహాలు మానా గ్రామానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తాయి.

‘మానా’ అనే పేరు ఎలా వచ్చింది?

పౌరాణిక విశ్వాసాల ప్రకారం, మణిభద్ర దేవుని పేరుతో ఈ ప్రాంతానికి ‘మానా’ అనే పేరు వచ్చిందని చెబుతారు. మతపరమైన విశ్వాసాల్లో ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రమైన భూమిగా పేర్కొంటారు. మానా గ్రామంలోని ప్రధాన ఆకర్షణల్లో భీమ్ పుల్ ఒకటి. సరస్వతీ నదిపై సహజంగా ఏర్పడిన భారీ రాతిబండను భీమ్ పుల్‌గా పిలుస్తారు. పాండవులు స్వర్గారోహణం కోసం వెళ్తున్న సమయంలో ద్రౌపది నదిని దాటేందుకు వీలుగా భీముడు భారీ రాయిని నదిపై ఉంచాడని పురాణ కథనం ఉంది. ఈ కథకు చారిత్రక ఆధారాల కంటే పౌరాణిక విశ్వాసమే ప్రధాన ఆధారం అయినప్పటికీ, భీమ్ పుల్‌ను చూసేందుకు ప్రతిరోజూ అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

‘చివరి గ్రామం’ నుంచి ‘తొలి గ్రామం’గా..

మానా గ్రామాన్ని చాలా కాలం పాటు ‘భారతదేశపు చివరి గ్రామం’గా పిలిచేవారు. అయితే 2022 అక్టోబర్ 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా సరిహద్దు గ్రామాలను దేశానికి ‘చివరి గ్రామాలు’గా కాకుండా, దేశాన్ని ప్రారంభించే ‘తొలి గ్రామాలు’గా చూడాలని పేర్కొన్నారు. ఆ తర్వాత బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ఇక్కడ ‘మొదటి భారతీయ గ్రామం మానా’ అనే నామఫలకాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈ గ్రామానికి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం మానా గ్రామం వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ పరిధిలో అభివృద్ధి చెందుతున్న సరిహద్దు గ్రామాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ ప్రధానంగా భోటియా సమాజానికి చెందిన ప్రజలు నివసిస్తారు. శీతాకాలంలో భారీగా మంచు కురిసే సమయంలో స్థానికులు దిగువ ప్రాంతాలకు తరలివెళ్తారు. పర్యాటకం, హోమ్‌స్టేలు, స్థానిక హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తులు వారి జీవనోపాధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

మానా గ్రామంలో చూడాల్సిన ప్రదేశాలు

హిమాలయ పర్వతాల మధ్య ఉన్న మానా గ్రామం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్లటి వాతావరణం, ప్రశాంతమైన పరిసరాలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.

ఇక్కడ సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో:

  • భీమ్ పుల్
  • వ్యాస్ గుహ
  • గణేష్ గుహ
  • సరస్వతీ నది ప్రవాహ ప్రాంతం
  • వసుధారా జలపాతం
  • తప్త కుండ్
  • త్రిపుర బాల సుందరి ఆలయం
  • బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు వంటివి ఉన్నాయి.

ముఖ్యంగా వ్యాస్ గుహ, గణేష్ గుహలకు పురాణాలతో సంబంధం ఉందని విశ్వసిస్తారు. మరోవైపు వసుధారా జలపాతం, హిమాలయ ప్రకృతి దృశ్యాలు ట్రెక్కింగ్‌, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి.

ప్రకృతి, పురాణాలు, సంస్కృతికి చిరునామా

మానా గ్రామం కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. హిమాలయ ప్రకృతి అందాలు, పౌరాణిక కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, సరిహద్దు ప్రాంత జీవనశైలి, స్థానిక సంస్కృతుల సమ్మేళనంగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది.

బద్రీనాథ్ యాత్రకు వెళ్లే భక్తులు, హిమాలయాలను ఆస్వాదించాలనుకునే ప్రకృతి ప్రేమికులు, పురాణాలపై ఆసక్తి ఉన్న పర్యాటకులు తప్పక సందర్శించాలనుకునే ప్రదేశాల్లో మానా గ్రామం ఒకటి. ‘భారతదేశపు తొలి గ్రామం’గా కొత్త గుర్తింపు పొందిన ఈ చిన్న గ్రామం, తన సహజ సౌందర్యం, పురాణ వైభవంతో ప్రతి సందర్శకుడికి ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.

Follow Us