Laksha Pasupu kommula Nomu: భార్య ఆరోగ్యం, సుఖ సంతోషాల కోసం చేసే లక్షపసుపు కొమ్ముల వ్రతం.. విధానం.. ఉద్యాపన

| Edited By: Surya Kala

Aug 03, 2023 | 9:59 AM

లక్షపసుపు కొమ్ముల వ్రతం చేయాలనుకునే వారు భక్తి శ్రద్ధలతో ప్రతిరోజూ ఆరునెలల పాటు పై కథను చెప్పుకుంటూ తలపై అక్షింతలు వేసుకోవాలి. ఏడవ నెల మొదటి రోజున ఉద్యాపన చేసుకోవాలి. దీనిలో భాగంగా వెన్ను విరగని పసుపు కొమ్ములు లక్ష ఎంచుకుని తగినంత కుంకుమ తో శ్రీ మహాలక్ష్మీ ని కాని శ్రీ గౌరిని గాని పూజించాలి. ఆ పసుపు కొమ్ములు కుంకుమ తీసుకుని ఇంటి చుట్టూ ఉన్న వీధులన్నీ తిరుగుతూ ప్రతి ఇంట్లోనూ దోసెడుకు తక్కువ కాకుండా పసుపు కొమ్ములు, కుంకుమ పంచి పెడతారు.

Laksha Pasupu kommula Nomu: భార్య ఆరోగ్యం, సుఖ సంతోషాల కోసం చేసే లక్షపసుపు కొమ్ముల వ్రతం.. విధానం.. ఉద్యాపన
Laksha Pasupu Kommula Nomu
Follow us on

ఎంత డబ్బు సంపాదించినా మనిషికి మనశ్శాంతి ముఖ్యం. కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే ఆ ఇంట్లో సిరి తప్పక నిలుస్తుంది. అయితే కొందరికి సిరి సంపదలు, అనుకూలుడైన అందమైన భర్త అన్నీ ఉన్నా అతని ఆరోగ్యం బాగోలేక పోతే అతని భార్యకు మనశ్శాంతి ఉండదు. అనుకూలమైన దాంపత్యం కోసం భర్త ఆయురారోగ్యం కోసం పూర్వం నుంచి ఒక ప్రత్యేకమైన వ్రతం ఆచరణలో ఉంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తలు సుఖసంతోషాలతోనూ, ఆయురారోగ్యాలతోనూ, సిరిసంపదలతోనూ జీవిస్తారని పండితులు చెబుతున్నారు.

లక్షపసుపు కొమ్ముల వ్రతం

పూర్వం ఒక ఊరిలో బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది. ఆమె భర్త చాలా అందగాడు, విద్యావంతుడు, గుణవంతుడు , ఎలాంటి దురలవాట్లు లేని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి. వారికి ధనానికి సైతం ఎలాంటి కొదవలేదు. సిరిసంపదలు కలిగిన వారు.. లక్ష్మి కటాక్షంతో ధన, ధాన్యరాశులకు ఎలాంటి లోటూ లేదు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణ ఇల్లాలికి మనశ్శాంతి మాత్రం లేదు. దీనికి కారణం తరచుగా ఆమె భర్త అనారోగ్యం పాలవ్వడం. భర్త అనారోగ్యంతో ఆమె ఏ సుఖానికి నోచుకోక ఎపుడూ దిగాలుగా ఉండేది. అలాంటి సమయంలో ఒక రోజు వారింటికి ఒక యతీశ్వరుడు అతిథిగా వచ్చాడు. ఆయనకు ఆ బ్రాహ్మణ ఇల్లాలు భక్తితో సపర్యలు చేసి అతిథి సత్కారాలతో గౌరవించింది. ఆమె పరిస్థితిని దివ్య దృష్టితో తెలుసుకున్న యతీశ్వరుడు ఇలా చెప్పాడు – “సాధ్వీమణి – చింతించకు లక్ష పసుపు కొమ్ము ల వ్రతం చేసుకుని ఉద్యాపన చేస్తే సమస్యలన్నీ చక్కబడతాయి.” అన్నాడు. అంతట యతీశ్వరుడు చెప్పిన విధానంలో ఆ బ్రాహ్మణ పత్ని వ్రతం చేసింది. దీంతో ఆమె భర్త అనారోగ్య సమస్యలు తొలిగి వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలసి సుఖంగా జీవించారు.

వ్రత విధానం – ఉద్యాపన

ఇవి కూడా చదవండి

ఈ వ్రతం చేయాలనుకునే వారు భక్తి శ్రద్ధలతో ప్రతిరోజూ ఆరునెలల పాటు పై కథను చెప్పుకుంటూ తలపై అక్షింతలు వేసుకోవాలి. ఏడవ నెల మొదటి రోజున ఉద్యాపన చేసుకోవాలి. దీనిలో భాగంగా వెన్ను విరగని పసుపు కొమ్ములు లక్ష ఎంచుకుని తగినంత కుంకుమ తో శ్రీ మహాలక్ష్మీ ని కాని శ్రీ గౌరిని గాని పూజించాలి. ఆ పసుపు కొమ్ములు కుంకుమ తీసుకుని ఇంటి చుట్టూ ఉన్న వీధులన్నీ తిరుగుతూ ప్రతి ఇంట్లోనూ దోసెడుకు తక్కువ కాకుండా పసుపు కొమ్ములు, కుంకుమ పంచి పెడతారు. కలిగిన వాళ్లయితే పిండి వంటలు సైతం పంచి పెడతారు. మహిళలు సోమవారం ఈ వ్రతం ఆచరిస్తే దీర్ఘసుమంగళి యోగం తో పాటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)