Bhimashankar Jyotirlinga: 5 నెలల తర్వాత భక్తులకు దర్శనం.. భీమాశంకర్ ఆలయం రీఓపెన్ డేట్ ఫిక్స్
Bhimashankar Temple Reopening Date: మహారాష్ట్రలోని ప్రసిద్ధ భీమాశంకర్ జ్యోతిర్లింగ ఆలయం ఐదు నెలల విరామం తర్వాత 2026 జూన్ 15న భక్తులకు తిరిగి తెరుచుకోనుంది. దర్శనం కోసం జూన్ 5 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుండగా, ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

మహారాష్ట్రలో పుణే సమీపంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం భీమాశంకర్ జ్యోతిర్లింగం ఆలయం (Bhimashankar Jyotirlinga Temple) గత ఐదు నెలలుగా మూసివేసివేయబడి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ భక్తులకు దర్శనం కోసం అందుబాటులోకి రానుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి సోయగాల నడుమ వెలసిన ఈ పవిత్ర క్షేత్రం 2026 జూన్ 15 నుంచి తిరిగి దర్శనాలకు తెరుచుకోనుంది. దీంతో శివభక్తుల నిరీక్షణకు తెరపడనుంది.
సింహస్థ ఏర్పాట్ల నేపథ్యంలో మూసివేత
మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వర్ ఆలయం (Trimbakeshwar Temple) పరిసర ప్రాంతాల్లో జరగనున్న సింహస్థ కుంభమేళా ఏర్పాట్ల దృష్ట్యా రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల్లో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచేందుకు భీమాశంకర్ ఆలయాన్ని ఈ ఏడాది జనవరి నుంచి తాత్కాలికంగా మూసివేశారు.
జూన్ 5 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్
ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావడంతో జూన్ 15 నుంచి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. దర్శనం కోసం అవసరమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 5 నుంచే ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు ముందస్తుగా తమ స్లాట్ను బుక్ చేసుకుని దర్శనానికి హాజరుకావాలని సూచించారు.
భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు
గత ఐదు నెలల కాలంలో ఆలయ ప్రాంగణంలో పలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. భక్తుల రాకపోకలు సులభంగా ఉండేలా మార్గాలను విస్తరించడంతో పాటు, భద్రతా ఏర్పాట్లను కూడా మరింత బలోపేతం చేశారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు భీమాశంకర్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రద్దీ నిర్వహణ, భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
భీమాశంకర్ ఆలయానికి ఎలా చేరుకోవాలి?
భీమాశంకర్ జ్యోతిర్లింగానికి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు:
- Pune Junction Railway Station – సుమారు 125 కి.మీ. దూరం
- Karjat Railway Station – సుమారు 106 కి.మీ. దూరం
- పుణే నుంచి రాష్ట్ర రవాణా సంస్థ (MSRTC) బస్సులు, ప్రైవేట్ టాక్సీలు, క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కొండ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి ప్రయాణించే భక్తులు వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకుని వెళ్లడం మంచిది.
12 జ్యోతిర్లింగాల్లో ఒకటి
భీమాశంకర్ ఆలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ప్రతి ఏడాది దేశం నలుమూలల నుంచి వేలాది మంది శివభక్తులు ఇక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయం తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో భక్తులు ముందుగానే ఆన్లైన్లో నమోదు చేసుకుని దర్శనానికి సిద్ధం కావాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
