Telugu News Spiritual Bhogi 2025: bhogi pallu festival rituals and know the significance
Bhogi Festival: భోగి రోజున చిన్నారుల తలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు? శాస్త్రీయ కోణం ఏమిటంటే..
భోగి పండగ రోజున పిల్లలకు భోగి పళ్లు పోయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భోగి పండ్లను చిన్న పిల్లల తలపై పోస్తారు. భోగిపండ్లుగా రేగుపండ్లను ఉపయోగిస్తారు. అయితే పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? ఈ సాంప్రదాయం వెనుక ఉన్న ఆంతర్యం, పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం..
తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండగను కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా ఘనంగా జరుపుకొంటారు. దక్షిణాయణం చివరి రోజున భోగిగా జరుపుకుంటారు. సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు, సినిమాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, కోడి పందాలు వంటి సందడి. మొదటి రోజుని భోగిగా జరుపుకుంటారు. భోగ భాగ్యలను ఇచ్చే భోగి రోజున అభ్యంగన స్నానాలు చేసి భోగి మంటలు వేసి ఆవు పేడతో చేసిన పిడకలను ఆ మంటల్లో వేసి పండగను జరుపుకుంటారు. ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. సాయంత్రం చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీసి భోగిపళ్ళు పోస్తారు. పేరంటము జరుపుతారు. ఇలా చేయడం వలన పిల్లలకు దృష్టి దోషం తొలుగుతుందని భావిస్తారు.
భోగి రోజు సాయం కాలం పిల్లలకు భోగి పండ్లు పోయడం ఆచారంగా వస్తుంది. భోగిపండ్లుగా రేగుపండ్లను ఉపయోగిస్తారు. రేగుపండ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు కలుపుతారు. ఈ రేగి పళ్లను పిల్లల తల మీ నుంచి పోస్తారు. ఇలా చేయడం వలన విష్ణువి అనుగ్రహం లభిస్తుంది విశ్వాసం.
భోగి పండ్లు పోయడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏమిటంటే పిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వాసం,
రేగి పండ్లను బదరీ ఫలాలంటారు. అంటే రేగు పండ్లు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట.
ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.
భోగి పండగ మర్నాడు సంక్రాంతి అంటే సూర్యుడి పండగ.. రేగు పండు గుండ్రని రూపం, సూర్యుడి రంగుని పోలి ఉంటుంది. కనుక ఈ రేగు పండుని అర్క ఫలమని కూడా పిలుస్తారు.
సూర్యుడు ఆశీస్సులు పిల్లలపై ఉండాలని ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవించాలని కొరుతూ ఈ భోగి పండ్లను పిల్లలకు పోస్తారట. కొంత మంది నెలల పిల్లల నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోసి పెద్దవారి ఆశీస్సులు ఇప్పిస్తారు.
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.