వాళ్ళను కాదు, నన్ను పిలవండి, పంజాబ్ గవర్నర్ పై సీఎం అమరేందర్ సింగ్ ఆగ్రహం, ఇది బీజేపీ ఎత్తుగడేనని విమర్శ
పంజాబ్ లో ఇటీవల మొబైల్ టవర్లను రైతులు ధ్వంసం చేయడంపై గవర్నర్ వీపీ సింగ్ బద్నూర్ ఆగ్రహించి ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ఆయనపై మండిపడ్డారు.

పంజాబ్ లో ఇటీవల మొబైల్ టవర్లను రైతులు ధ్వంసం చేయడంపై గవర్నర్ వీపీ సింగ్ బద్నూర్ ఆగ్రహించి ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ఆయనపై మండిపడ్డారు. రాజ్యాంగ పదవిని (గవర్నర్ వ్యవస్థను) అపసవ్య స్థితి లోకి లాగేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై బీజేపీ చేస్తున్న ప్రచారానికి గవర్నర్ తలొగ్గుతున్నారని పేర్కొన్నారు. ఏదైనా వివరణ కావాల్సి వస్తే అధికారులను కాదని, హోం శాఖను కూడా చూస్తున్న తనను పిలవాలని అమరేందర్ సింగ్ అన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల అంశాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్ళించడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. దీనిపై మీకేదైనా అభిప్రాయమంటూ ఉంటే నాకు సమన్లు జారీ చేసి ఉండాల్సింది అని వ్యాఖ్యానించారు. గత నెలలో పంజాబ్ లో రిలయెన్స్ జియోకు చెందిన వందలాది మొబైల్ టవర్లను రైతులు నాశనం చేశారు. అయితే ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించిన ముఖ్యమంత్రి అంతలోనే అన్నదాతలను పూర్తిగా సమర్థిస్తూ మాట్లాడారు. ఈ టవర్లను మళ్ళీ బాగు చేయవచ్ఛునని, కానీ ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న అన్నదాతల జీవితాలను, సూసైడ్ చేసుకున్నవారి కుటుంబాలను బాగు చేయగలమా అని ఆయన అన్నారు.
రాష్ట్ర గవర్నర్ తీరుపై అమరేందర్ సింగ్ ఇంత తీవ్రంగా స్పందించడం ఇదే మొదటిసారి.