ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎవ్వరినీ పట్టించుకోకుండా సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ.. తనదైన మార్కులో పరిపాలన చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన పరిపాలనపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. వారికి కౌంటర్ కూడా ఇవ్వకుండా.. మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నారు. ఈ క్రమంలో జగన్ ఆలోచనలు ఏంటి..? ఆయన వేస్తోన్న అడుగుల వలన భవిష్యత్లో ఎలాంటి పరిణామాలు చోసుకుంటాయి..? ఇలాంటి ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు కూడా సమాధానాలను అంచనా వేయలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జిల్లాలకు కొత్త ఇన్ఛార్జ్లను మరోసారి నియమించారు జగన్.
ఈ ఏడాది జూన్లో 13 జిల్లాలకు 13మంది మంత్రులను ఇన్ఛార్జ్లుగా నియమించగా.. నాలుగు నెలలు కూడా పూర్తికాకుండానే ఇప్పుడు మళ్లీ కొత్త వారిని జగన్ నియమించారు. ఇందులో మహిళా మంత్రులకు చోటు దక్కకపోగా.. మొదటి సారి ఆ ఛాన్స్ లభించని కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్లు ఈ సారి లిస్ట్లో చేరిపోయారు. ఇక మేకతోటి సుచరిత, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నానిలను ఇన్ఛార్జ్ మంత్రుల హోదా నుంచి తప్పించారు. కాగా నాలుగు నెలల్లోనే జిల్లాల ఇన్ఛార్జ్లను మార్చడానికి గల కారణమేంటన్న దానిపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతోంది.
అయితే తన కేబినెట్లోకి మొదటిసారి మంత్రులను తీసుకునే సమయంలో.. వారికి ఆ పదవీకాలం రెండున్నరేళ్లేనని చెప్పిన జగన్.. ఆ తరువాత ఆయా పదవుల్లో మరికొందరికి ఛాన్స్ ఇస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు పాలన విషయంలో పారదర్శకత చూపించాలని.. ఎవరూ తప్పు చేసినా ఉపేక్షించనని.. వీరిందరికీ హెచ్చరికలు కూడా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక కేబినెట్ను పక్కనపెడితే.. ఇన్ఛార్జ్ల విషయంలో కూడా జగన్ అంత పక్కాగా ఉండటానికి గల కారణం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్లుగా వీరి పని తీరుపై ఫోకస్ పెట్టిన జగన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇటీవల సంచలనం రేకెత్తించిన కాకాణి వర్సెస్ కోటంరెడ్డి వ్యవహారంలో ఆ జిల్లా ఇన్ఛార్జి హోంమంత్రి సుచరిత నిస్సహాయ ధోరణి పట్ల జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు కూడా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. అంతకుముందు తమకు కేటాయించిన జిల్లాలో చాలా మంది మంత్రులు పెద్దగా పట్టు సాధించలేకపోయారట. అలాగే కొంతమంది జిల్లాల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించలేకపోయారని తెలుస్తోంది. వీటన్నింటికి తోడు కొందరి తీరుపై ఆయా జిల్లాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, నేతలు అసంతృప్తితో ఉన్నారన్న ఆరోపణలు కూడా జగన్ దృష్టికి వచ్చాయి. వీటికి సంబంధించిన ఫిర్యాదులన్నీ నేరుగా జగన్ వద్దకు వెళ్లాయట. అంతేకాకుండా మంత్రులకు సంబంధించిన రిపోర్టులను ఇంటలిజెన్స్ వర్గాల నుంచి ఎప్పటికప్పుడు తెప్పించుకున్నారట. ఇక ఇన్ఛార్జ్లను మార్చడానికి ముందే ఆయా మంత్రులపై వచ్చిన ఆరోపణలపై జగన్ వారినే ప్రశ్నించారని.. దానికి సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోవడంతో జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా తెలుస్తోంది. ఏదేమైనా జగన్ ఇచ్చిన షాక్తో ఇతర మంత్రులు కూడా అప్రమత్తమయ్యారని సమాచారం.