ఉద్యోగాల కల్పనలో ఇద్దరూ తోడు దొంగలే.. నిరుద్యోగులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి -భట్టి విక్రమార్క

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగలను మోసం చేయడంలో పోటీ పడుతున్నాయని సీఎల్‌పీ లీడర్‌ మల్లు భట్టి విక్రమార్క..

ఉద్యోగాల కల్పనలో ఇద్దరూ తోడు దొంగలే.. నిరుద్యోగులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి -భట్టి విక్రమార్క
Follow us

|

Updated on: Mar 02, 2021 | 4:58 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నిరుద్యోగులే లక్ష్యంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగలను మోసం చేయడంలో పోటీ పడుతున్నాయని సీఎల్‌పీ లీడర్‌ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఉద్యోగాల కల్పనపై ఇరు పార్టీలు కాకిలెక్కలు చెబుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నాని అన్నారు. ఇద్దరూ తోడు దొంగలే. ఎన్నికలు ముందు తిట్టుకోవడం ఎన్నికలయ్యాక లెక్కలు సర్దుబాటు చేసుకోవడం వీళ్ళిద్దరూ చేసే పనేనని భట్టి ఆరోపించారు.

ఉద్యోగాల విషయంలో నువ్వెన్నిఉద్యోగాలచ్చావంటే నీవెన్ని ఇచ్చావని రెండు పార్టీలు ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నాయని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. అసలు ఇద్దరు ఎన్ని ఉద్యోగాలిచ్చారో చర్చకు రావాలి. రెండు ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు పెంచకపోగా నిరుద్యోగ సమస్యను తీవ్ర చేశారని విమర్శించారు. లేబర్ బ్యూరో తాజా లెక్కల ప్రకారం జాతీయ నిరుద్యోగిత రేటు 21.6 శాతం వుంటే తెలంగాణా నిరుద్యోగ రేటు 33.9 శాతం వుందని అన్నారు. అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పకుండా బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకళ్ళను మంచి మరొకరు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ లెక్కన గత ఏడు ఏళ్ళలో 14 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాలి. కానీ, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నవి ఊడగొడుతున్నారని భట్టి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వరంగంలో అనేక భారీ సంస్థలను, పరిశ్రమలను స్థాపించి దేశానికి ఆస్తులను కూడబెట్టింది. ఆయా ప్రభుత్వ రంగ సంస్థల్లో sc, st, bc వర్గాలు తమ రిజర్వేషన్ల కోటా మేరకు ఉపాధిని, ఉద్యోగాలను పొందేవారన్నారు. కానీ, నేటి బీజేపీ సర్కార్‌.. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుండటంతో, తెగ నమ్ముతుండటంతో కొత్తగా ఒక్కరికీ ఉద్యోగం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా లు ప్రచార ఆర్భాటానికి తప్ప, ఆ నినాదాలతో కలిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు భట్టి. గ్రామీణ ఉపాధి అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. తాజా కేంద్ర బడ్జెట్ లో కూడా గ్రామీణ ఉపాధికి 34.5 శాతం నిధులను కట్ చేశారు. కొత్త ఉద్యోగాలు సంగతి దేవుడెరుగు.. మోదీ పాలనలో ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయని విమర్శంచారు. భారత జనాభాలో మూడింట రెండింతలు మంది 35 ఏళ్ళ లోపు వారని దేశ నిర్మాణానికి వారి శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకోవాల్సిన అవసరం వుందని 2014 ఎన్నికలకు ముందు మోదీ చెప్పారు. మరి గద్దెనెక్కాక ఓరగబెట్టింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. సాధించింది ఏమిటంటే….గత 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్టస్థాయికి నిరుద్యోగ రేటు చేరుకుందని మండిపడ్డారు.

ఇక తెలంగాణా విషయానికొస్తే దేశంలో నిరుద్యోగ సమస్య అధికంగా వున్న రాష్ట్రాల్లో తెలంగాణా కూడా ముందు భాగంలో వుంది. తెలంగాణాను సాధించుకుంది నీళ్ళు, నిధులు, నియామకాలు కోసం… కానీ, నియామకాల విషయంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరగుతోందని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆశలు కేసీఆర్ తీరుస్తాడని యువత ఆశిస్తే ఆయన మాత్రం తన కుటుంబ సభ్యులు, వారి అనుయాయుల ఆశలనే తీరుస్తున్నాడు. కానీ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు.

రాష్ట్ర ఏర్పాటుకు, ముఖ్యమంత్రి అవడానికి కారణమైన నిరుద్యోగులకు, ఉద్యోగాల కల్పనపై సీఎం కేసీఆర్కు శ్రద్ధ లేదు. నిరుద్యోగుల ఆర్తనాదాలు, ఆకలికేకలు దొరగారి ఫా హౌంజ్ కు, ప్రగతి భవన్ కు వినపడటం లేదా అని భట్టి ప్రశ్నించారు. దుబాయి..బొంబాయి..బొగ్గు బావేనా ఉమ్మడి రాష్ర్టంలో మన బతుకులు అన్నాడు…మరి ఈయన వచ్చాక ఉద్ధరించింది ఏమిటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశారని భట్టి మండిపడ్డారు.

రాష్ట్రంలో ఒక లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని పే రివిజన్ కమిషన్ నివేదికలో చెప్పింది నిజం కాదా అని భట్టి ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని తెలంగాణా ఏర్పటయ్యాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ ఊసే ఎత్తడం లేదు. పబ్లిక్ సర్వీసు కమిషన్ వెబ్ సైట్ లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య సంఖ్య 25 లక్షలు.. టీచర్ ఉద్యోగాల భర్తీ లేదు. ఒక్క డియస్సీ లేదు, విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు లేరు, అనేక విశ్వవిద్యాలయాల్లో ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు సహా అనేక పోస్టులు ఖాళీగా వున్నాయి…ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోకుండా ప్రయివేటు విశ్వవిద్యాలయలపై శ్రద్ధ చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం 50 వేల ఉద్యోగాల భర్తీ అనేది కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ద్రుష్టి పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు, మాయమాటలు చెప్తున్నారు. ఎప్పటిలోగా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారు, పరీక్షలు ఎప్పుడు, అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఎప్పుడు చేతిలో పెడతారో ఖచ్చితమైన తేదీని చెప్పగలరా? ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగభృతి ఊసేలేదు….3016 రుపాయలు ఇస్తానన్నారు, కానీ, ఇప్పటి వరకు దాని ప్రస్తావనే లేదు, కనీసం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించలేదని భట్టి విక్రమార్క విమర్శించారు.

Read more:

జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కరోనా వ్యాక్సిన్‌.. టీకా పట్ల అపోహలు అక్కరలేదన్న విజయలక్ష్మి