టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీలో పలు కీలక పదవులను నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో.. హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. బ్రహ్మయ్య మరణంతో.. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
కాగా.. గతంలో ఇప్పటికే ఆయనకి ఒకసారి గుండెపోటు వచ్చింది. 2019 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ సీటును ఆశించి భంగపడ్డారు. అప్పట్లో.. కడపలో మీడియా ముందు మాట్లాడుతూ.. ‘పార్టీలో కష్టపడినవారికి కాకుండా.. వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారని’ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని పలువురు చెబుతారు.