ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో మరో కేసు.. 2019 ఓటర్ల జాబితాతో 3 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతారని పిటిషన్
పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించడంవల్ల దాదాపు 3 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని..
ఏపీ పంచాయతీ ఎన్నికలకు అడ్డుగోడలు తప్పడం లేదు. ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ పట్టుదలతో ఉండగా.. అడ్డుకునేందుకు ప్రభుత్వం అంతే పట్టుదలతో పావులు కదుపుతుంది. చివరికి ఎస్ఈసీకి హైకోర్టు పచ్చజెండా ఊపడంతో నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరోవైపు ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ సరిగా లేదంటూ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు.
పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించడంవల్ల దాదాపు 3 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్కు తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల పిటిషన్ దాఖలు చేశారు.
కొత్తగా ఓటు హక్కు వచ్చిన తమకు దానిని వినియోగించుకునే అవకాశం కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానానికి అఖిల నివేదించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంవల్ల కొత్తగా ఓటు హక్కు వచ్చిన 3 లక్షల మంది నష్టపోతారని వివరించారు
18ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని రాజ్యాంగంలోని అధికరణ 326 కల్పిస్తోందని హైకోర్టుకు తెలిపారు. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ ఉత్తర్వులివ్వాలని అఖిల కోరారు.