జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడినిపుట్టిస్తున్నాయి. ఇటీవల రాజధానిలో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి రెండు రోజుల పాటు.. అమరావతి, మంగళగిరిలో పవన్ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజధాని పర్యటనలో భాగంగా మంత్రి బొత్సపై చేసిన వ్యాఖ్యల అటు వైసీపీ శ్రేణుల్లో, జనసేనా సైనికుల్లో చర్చలకు దారితీశాయి. వైసీపీలో విభేదాలు సృష్టించేందుకే పవన్ కళ్యాణ్ ఇలా వ్యాఖ్యలు చేశారా.. అసలు పవన్ వ్యాఖ్యల వెనక ఎవరైనా ఉన్నారా.. లేక ఆయన సొంత ఆలోచనలా అన్న దానిపై చర్చ సాగుతోంది.
ఏపీ సీఎం జగన్ ఉచ్చులో పడవద్దనీ, జగన్ను నమ్మి మోసపోవద్దంటూ పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణకు సూచించారు. సీఎం కావాలని కలలుకంటున్న బొత్స సత్యనారాయణకు… జగన్ వల్ల ఆ ఛాన్స్ రాకుండా పోతుందనీ, అందువల్ల బొత్స… ఈ విషయంలో పునరాలోచించుకోవాలంటూ.. పవన్ వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా తెల్లారే మంత్రి బొత్స ప్రెస్ మీట్ పెట్టారు. వైసీపీలోకి ఇష్టపడి వచ్చానని.. తమ సీఎం జగన్ మాత్రమే అని.. దీంట్లో రెండో మాట లేదంటూ స్పష్టం చేశారు. అయితే జనసేన, టీడీపీపై కౌంటర్ అటాక్ చేశారు బొత్స. ప్రతిపక్షంలో జనసేన, టీడీపీ లాంటి పార్టీలు ఉన్నంతకాలం.. అధికారం వైసీపీదేనని అన్నారు.
అయితే పవన్ వ్యాఖ్యల్ని మంత్రి బొత్స వ్యతిరేకించినప్పటికీ.. ఆయన అనుచరులు ఈ కామెంట్లను సీరియస్గా తీసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచీ బొత్స సీఎం అయితే… ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయనీ.. ఎప్పటి నుంచో వేచిచూస్తున్నా.. అలాంటి పరిస్థితులు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. వైఎస్ఆర్ హయాంలో బొత్స కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్ఆర్ మరణానంతరం.. కొద్ది రోజులు మౌనంగా ఉన్నా.. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్న ఆయన.. అమరావతి రాజధాని అంశంపై చేసిన వ్యాఖ్యలతో ప్రధానంగా మారారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. బొత్స చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు వైసీపీపై దుమ్మెత్తి పోశాయి. అయితే.. గతంలో కూడా.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బొత్స.. ప్రతిపక్షాలకు అంతే ధీటుగా కౌంటర్ అటాక్ చేసేవారు. అయితే ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలపై అంత పెద్దగా రియాక్ట కాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మంత్రి బొత్స మనసులో సీఎం అవ్వాలనే ఆలోచన ఉండటం వల్లే ఆయన గట్టిగా మాట్లాడలేదేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ ఉన్నంత కాలం సీఎం ఛాన్స్ ఎలాగు దక్కదని.. అయితే బొత్సకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.