
పార్టీ టికెట్ కోసం అధిష్టానం దగ్గర కాళ్లావేళ్లా పడిన వారిని చూశాం కానీ.. టికెట్ ఇస్తే కాదు పొమ్మన్నవారిని ఎప్పుడైనా చూశామా? టికెట్ను తృణప్రాయంగా తిరస్కరించిన వ్యక్తిని బెంగాల్లో చూడొచ్చు.. బెంగాల్లో ఎలాగైనా సరే అధికారం సంపాదించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ నిన్న అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించింది. అందులో దివంగత కాంగ్రెస్ నాయకుడు సోమెన్ మిత్ర భార్య శిఖ మిత్ర పేరు కూడా ఉంది.. కోల్కతా నగరంలోని చౌరింఘీ నియోజకవర్గం నుంచి శిఖ మిత్ర పోటీ చేస్తున్నారని కూడా ప్రకటించింది బీజేపీ.. శిఖ మిత్ర మాత్రం తనను సంప్రదించకుండానే బీజేపీ తన పేరు ప్రకటించిందని అంటున్నారు. బీజేపీ తీరుపై మండిపడుతూ అసలు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని తేల్చి చెప్పేశారు. తాను బీజేపీ చేరబోవడం లేదని స్పష్టం చేశారు.
కొన్ని రోజుల కిందట బీజేపీ నేత సువేధు అధికారితో శిఖ మిత్ర సమావేశమయ్యారు. ఇది జరిగిన తర్వాత శిఖ మిత్ర బీజేపీలో చేరబోతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు శిఖ మిత్ర పార్టీలో చేరికపై కుండబద్దలు కొట్టడంతో మీడియాలో వచ్చిన కథనాల్లో నిజం లేదని తేలిపోయింది. అభ్యర్థిని అడగకుండా పేరు ఎలా ప్రకటిస్తారంటూ బీజేపీని ఆడిపోసుకుంటున్నారు కొందరు. విపక్ష పార్టీలు మాత్రం ఈ అంశంతో ఆడుకుంటున్నాయి. కొందరైతే వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. 2021 బెంగాల్ ఎన్నికల కోసం కమలం పార్టీ నేతలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు కానీ.. అలా ప్రకటించిన ప్రతీసారి వారి ముఖాలపై పడ్డ గుడ్లతో బోలెడన్ని ఆమ్లెట్లు తయారు చేసుకోవచ్చని టీఎంసీ సీనియర్ నేత బెరెక్ ఓ బ్రియెన్ అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి: Tears of Blood: బహిష్టు సమయంలో ఆ మహిళ కంట రక్తం.. ఆశ్యర్యపోయిన వైద్యులు.. ఎక్కడో తెలుసా..?
తీగ లాగితే డొంక కదులుతోంది.. గసగసాల సాగుతో ఘాటు దందా.. రంగారెడ్డి జిల్లాలో బయటపడ్డ ఓపీఎం పంటసాగు