మీ రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా.. ఒక్క రూపాయి జీతం అధికంగా ఇచ్చినా రాజీనామాకు సిద్ధం -మంత్రి వేముల

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల ప్రచారం స్పీడందుకుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు..

మీ రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా.. ఒక్క రూపాయి జీతం అధికంగా ఇచ్చినా రాజీనామాకు సిద్ధం -మంత్రి వేముల
Follow us

|

Updated on: Mar 01, 2021 | 8:10 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల ప్రచారం స్పీడందుకుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కీలక నేతలు రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టారు. ఇక అధికార పార్టీ నుంచి సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రులు ప్రచార పర్వంలోకి దిగారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి కి మద్దతుగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దామోదర రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. అట్లాంటి వ్యక్తిని ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బండి సంజయ్ ను హెచ్చరిస్తున్నా..కేవలం ఆరు సంవత్సరాలలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తే మా టిఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరన్నారు.

బీజేపీ 21 రాష్ట్రాల్లో కాంగ్రెస్ 5 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. తెలంగాణ లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయా..? అని వేముల ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను, విద్యావంతులను తప్పు దోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బాగా మాట్లాడుతున్న బండి సంజయ్ కి, కాంగ్రెస్ కు సవాల్ ఈ వేదిక నుండి విసురుతున్నా.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కంటే మీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రూపాయి జీతం ఎక్కువ ఇచ్చిన నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా….మీరు సిద్ధమా..? అని మంత్రి వేముల సవాల్‌ విసిరారు.

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల జాబితా ప్రకటించారు.. తెలంగాణ ప్రభుత్వం కంటే మీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చారా..? అని బీజేపీ, కాంగ్రెస్‌లను మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంటే మీ పాలిత రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినామని నిరూపించినా నా మంత్రి పదవి రాజీనామాకు సిద్ధం అని సవాల్‌ చేశారు.

పట్టభద్రులారా, ఉద్యోగులారా ఆలోచన చేయండి.. వారి మాయమాటలకు మోసపోకండి. పూర్వ భారత ప్రధాని పి.వి కుమార్తె పాలమూరు గడ్డ కోడలు వాణీదేవి మన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి బరిలో నిలిపారు. పాలమూరు కోడల్ని గెలిపించుకోవాల్సిన బాద్యత మనందరిది.. నాగర్ కర్నూల్ లో 11 వేల ఓట్లు ఉన్నాయి.10 వేల ఓట్లు టిఆర్ఎస్ కు రావాలి. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఆయన మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరింత గౌరవం పెంచేందుకు మీరంతా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. పట్టభద్రులతో వేయించే బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలని మంత్రి కోరారు.

మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్యోగాల భర్తీపై మంత్రి వేముల చేసిన సవాళ్లకు కాంగ్రెస్‌, బీజేపీ నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందోననే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.

Read more:

వ్యాక్సిన్‌ ముందు యువతకు ఇవ్వండి.. రేపో మాపో పోయేటోడిని నాకెందుకు వ్యాక్సిన్‌ -మల్లికార్జున ఖర్గే