మహారాష్ట్ర : ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే పోటీచేసిన ఎంఐఎం.. తొలిసారిగా వేరే రాష్ట్రంలో బరిలోకి దిగనుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సెంట్రల్ ఎంఐఎం ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఔరంగబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇంతియాజ్ బరిలో ఉంటారని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్టర్లో పేర్కొన్నారు. ఔరంగబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. అయితే మహారాష్ట్రలో మజ్లిస్ పార్టీ రెండు లోక్సభ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. చివరకు ఒకటే స్థానం నుంచి పోటీకి సిద్ధమైంది. బైకులా ఎమ్మెల్యే వారిస్ పఠాన్ను ముంబై నార్త్ సెంట్రల్ లేదా ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయించాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు.
Imtiaz Jaleel will be AIMIM’s candidate for the Aurangabad Parliamentary Constituency.
— Asaduddin Owaisi (@asadowaisi) March 26, 2019