
ఏలూరు, డిసెంబర్ 26: నందనవనంగా మారిన దేవాలయం. పూల ఉద్యానవనంలో విహరిస్తూ ఇష్టదైవాన్ని సందిర్శించుకుంటే మనస్సు పోందే ఆ ఆనందమే వేరు. అటువంటి అవకాశం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరులో స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో నెలవైవుంది.

ఆలయంలో రకరకాల పూలమొక్కలు ఏర్పాటు చేసారు. ఆలయంలోనికి వచ్చిన భక్తులు అందమైన విరభూసిన పూలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగు రంగుల పూలు, వికసిస్తూ, పరిమళాలు వెదజల్లుతూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. రకరకాల బంతి, చేమంతి, డాలీలు, లిల్లీ, మంటి రకాల పూల మొక్కలను కడియం నర్సరీల నుండి తెప్పించి ఆలయంలో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన భక్తులు పూల మొక్కలను చూసి పారవశ్యం పొందుతున్నారు.

ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి మాసాలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ విధంగా అలంకరణ పూల మొక్కలతో చేస్తారు. ఆలయ అధికారులు, అర్చకులు దాతల సహకారంతో పూల మొక్కలను తెప్పించి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసారు. మొక్కల పోషణను ఆలయ అధికారులు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు.

ఆహ్లాదకర వాతావరణంలో స్వామి వారిని దర్శనం చేసుకోవడం ఎంతో ప్రశాంతతనిస్తుందని భక్తులు చెప్తున్నారు. వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న భక్తులు పూలమొక్కల లో ఫోటోలు దిగుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేట్లు ఏర్పాటు చేసిన ఆలయ అధికారులను అభినందించారు భక్తులు.

ప్రతీ దేవాలయంలో ప్రకృతితో మమేకమయ్యే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నారు. పూలమొక్కలు ఏర్పాటు చేయడతో ఆహ్లాదకరమైన వాతావరణం అందరినీ ఆలయానికి వచ్చేట్టు ఆకర్షిస్తుందని భక్తులు, ఆలయ అధికారులు అంటున్నారు.