నరకమంటే పాపం... పాపం చేస్తే పోయేది నరకం. అలాంటి నరకంలో నిత్యం పాపులతో గడిపే యముడికీ మనశ్శాంతి కరువైందట. అప్పటికే హిరణ్యకశిపుడిని సంహరించి ఉగ్రరూపంలో ఉన్న నారసింహుడు ప్రహ్లాదుడి అర్చనతో శాంతించి యోగ రూపంలోకి మారి కొలువైన చోటే ధర్మపురి అనే విశిష్ఠత ఈ క్షేత్రానిది.
అదే సమయంలో బ్రహ్మది దేవతలు, రుషులు, మునులతో కలిసి ధర్మపురిలో ఎక్కడా లేనివిధంగా దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరిలో స్నానమాచరించి, ఆ యోగ నారసింహుడి దర్శనంతో పునీతులయ్యారన్నది ధర్మపురి స్థలపురాణాల మాట. అంతమంది దేవతలు కూడా ఆ నారసింహుడిని దర్శించి పునీతులవ్వడంతో.. యముడిలోనూ ఆ ధర్మపురి గురించి ఆలోచనలు మొదలయ్యాయట.
నిత్యం నరకానికొచ్చే పాపులను చూస్తూ.. వారు చేసిన నేరాల గురించి వింటూ.. వారికి వివిధ రకాల శిక్షలు విధిస్తూ.. మనశ్శాంతి కరువైన యముడు.. వాటన్నింటినుంచీ దూరమై.. ఆ నారసింహుడి దర్శనంతో పునీతుడయ్యేందుకు ధర్మపురికి వచ్చాడని ప్రతీతి.
అలాగే, ఎన్నో యాత్రలు చేసుకుని చివరకు ధర్మపురి పుణ్యగోదావరిలో స్నానమాచరించి.. ఆ తర్వాత యోగ నారసింహుడిని దర్శించుకున్న యముడికి.. అంతవరకూ పాపాత్ములకు శిక్షలతో పట్టుకున్న దోషాలు, మానసిక అశాంతి వంటివన్నీ దూరమయ్యాయని బ్రహ్మాండ, స్కాంధ పురాణాలు వెల్లడిస్తున్నాయి.
నైమిశారణ్యంలో సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు ఈ విషయాన్ని వివరించినట్టు.. నారదుడు పృథు మహారాజుకు క్షేత్ర మహత్యాన్ని చెబుతున్నప్పుడు వివరించినట్టుగా కూడా ఆ పురాణాలే వెల్లడిస్తున్నాయి.
యోగ లక్ష్మీనృసింహుడి దర్శనం కంటే ముందే మనకు ధర్మపురి ఆలయంలో యముడి ఆలయం కనిపిస్తుంది. పెద్ద పెద్ద కోరలతో.. చేతులో యమదండంతో భీకరాకరంలో కనిపిస్తుంది అష్ఠ దిక్పాలకులలో ఒకడిగా దక్షిణ దిశాధిపతిగా ఉన్న యముడి విగ్రహం. అలాగే గ్రహాల దృష్ట్యా దక్షిణ దిశాధిపతైన కుజుడికి నారసింహుడు అధిపతిగా పరాశరుడు చెప్పినట్టుగా కూడా పురాణాల ఉవాచ. ఈ క్రమంలో ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదనే నానుడి స్థిరపడింది. దీంతో ధర్మపురికి వచ్చే భక్తులు యమధర్మరాజుకు ప్రత్యేక అర్చనలు చేయడమూ ఈ క్రమంలోనే రానురాను పెరిగింది.
ముఖ్యంగా బహువిదియ.. యమద్వితీయ రోజు.. భగినీ హస్త భోజనం కోసం యముడు వెళ్లే రోజున.. అంటే దీపావళి తర్వాత రెండోరోజునాడు.. మహారాష్ట్ర ప్రాంతంలో భాయ్ దూజ్ గా కూడా పిలుస్తుంటారు. ఆ సమయంలో అకాల మృత్యు నివారణకై అధర్వణ వేదంలోని ఆయుష్యసూక్త పూజాదులతో పాటు.. యమసూక్తం, మంత్రసూక్తం, పురుషసూక్తం, శ్రీసూక్తం, జ్వరహర స్త్రోత్రం, రోగ నివార సూక్తం, యమాష్ఠకాది పూజలు చేస్తుంటారు.
అందుకే ధర్మపురిని దర్శిస్తే యమపురి దూరమ్మగునట అనే నానుడికి తగ్గట్టుగా.. ఇక్కడ యముడి దర్శనానంతరం భక్తులు మనశ్శాంతితో తిరిగి వెళ్తారనే ప్రతీతి బలపడింది...