- Telugu News Photo Gallery Spiritual photos Yaganti Temple: Most Interesting Facts About Yaganti Temple You Must Know
Yaganti Temple: Yaganti Temple: యాగంటిలో భారీగా భక్తుల రద్దీ.. ఈ క్షేత్రం విషయంలో బ్రహ్మంగారు చెప్పింది నిజమేనా..
యాగంటి క్షేత్రాన్ని జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుంటారు. ఈ యాగంటి క్షేత్రం ప్రకృతి రమణీయతల మధ్య నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఎర్రమల కొండల్లో కొలువై ఉంది. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంఘమ వంశానికి చెందిన రాజు హరిహర బుక్కరాయ నిర్మించారని చరిత్రకారులు అంచనా వేశారు.
J Y Nagi Reddy | Edited By: Surya Kala
Updated on: Dec 12, 2023 | 8:02 PM

యాగంటి క్షేత్రం ఉనికి పురాతన కాలం నుండి ఉందని భక్తుల నమ్మకం అపర శివ భక్తుడైన బృగు మహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశారని ఫలితంగా సతీ సమేతంగా ఇక్కడ శివుడు కొలువయ్యారని ఒక కథనం..

యాగంటి బసవయ్య: శివాలయాలు అనగానే ఆలయంలో నంది విగ్రహం ఉండడం సహజం శివాలయం లోకి అడుగుపెట్టగానే మనకు నందీశ్వరుడు కనిపిస్తాడు. ఐతే యాగంటి దేవాలయంలో ఉన్న నందీశ్వరునికి ఓ ప్రత్యేకత ఉంది ఆలయంలో ఈశాన్య భాగంలో నందీశ్వరుడు కొలువై ఉండడం.. ఆ నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత.. పురావస్తు శాఖ అంచనా ప్రకారం ఈ నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతుందని నిర్దారించారు.

లేపాక్షిలో ఇంతకంటే పెద్ద నందీశ్వర విగ్రహం ఉంది అయితే అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహము మొలిచి ఏర్పాటు చేశారని యాగంటిలో వెలిసిన నందీశ్వరుడు స్వయంభుగా వెలిశారని ఇక్కడి పురోహితులు అంటున్నారు. 90 సంవత్సరాల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు వీలు ఉండేదని భక్తులు అంటున్నారు.

ఇప్పుడు అది పెరిగిపోవడంతో మండపం స్తంభాలకు నందికి మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు. దీంతో నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలు పడడం లేదు.

బ్రహ్మంగారు చెప్పింది జరిగేనా.. యాగంటి బసవయ్య అంత అంతకు పెరిగి కలియుగాంతంలో రంకె వేసేనని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. బ్రహ్మంగారు చెప్పినట్లే యాగంటి బసవయ్య పెరుగుతుండడం ఇక్కడ గమనించవచ్చు. పురావస్తు శాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతుంది. ఇక్కడి నంది విగ్రహానికి భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా పూజలు నిర్వహిస్తారు.

ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా యాగంటి నందీశ్వరునికి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలోనే ఇక్కడ క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు వసతి గృహాలతో పాటు ఉచిత నిత్యాన్నదానం కూడా అందజేస్తున్నారు.





























