
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శక్తిపీఠం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఆలయ ఈవో, చైర్మన్, సభ్యులు, అర్చక, వేద పండితులు శాకాంబరీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

శాకాంబరీ ఉత్సవంలో భాగంగా శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారి మూలమూర్తిని 3 వేల కేజీల వివిధ రకాల కూరగాయలు,100 గుమ్మడికాయలు, 2 వేల నిమ్మకాయలు, ఆకు కూరలు, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు.

అలాగే దేవాలయ ప్రాంగణాన్ని వేల కేజీల పలు రకాల ఆకు కూరలు, కూరగాయలు, వివిధ ఫలాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూర హారతులిచ్చారు.

అలానే ఆలయంలోని రాజరాజేశ్వరిదేవికి, ఆలయం ఎదురుగా ఉన్న గ్రామదేవత అంకాలమ్మకు ప్రత్యేక పూజలు, శాకాలంకరణ చేశారు. అమ్మవారిని శాకాలతో అర్చించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని ప్రతీతి.

ప్రతి ఆషాడమాసం పౌర్ణమినాడు లోక కళ్యాణార్ధం భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఈ శాకాంబరీ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శాకాంబరీ అలంకారంలో ఉన్న భ్రమరాంబికాదేవి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు.