
కాణిపాకం ఆలయంలో ఉత్సవాలు జరిగే సమయంలో మాడ వీధుల్లో ఊరేగింపు కోసం తయారు చేసిన బంగారు రథాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, స్వాత్మానందేంద్ర సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

కలశ పూజ, హోమం, పూర్ణాహుతితో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా స్వర్ణ రథాన్ని ప్రారంభించారు. నూతన స్వర్ణ రథంపై సిద్ధి, బుద్ధి సమేత గణనాధున్ని కాణిపాక మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు.

స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న అనంతరం.. స్వామివారికి ఏర్పాటు చేసిన స్వర్ణరథం శిలాఫలకాన్ని ఆవిష్కరించి.. స్వర్ణ రథాన్ని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.

ఈ వరసిద్ధి వినాయక స్వర్ణరథాన్ని 25 కిలోల బంగారాన్ని వినియోగించి, సుమారు 6.50 కోట్ల రూపాయలతో నిర్మించారు.

కాణిపాకం ఆలయానికి బంగారు రథం సమకూరడం చాలా సంతోషంగా ఉందని స్వరూపానంద స్వామి చెప్పారు. రాష్ట్రంలోని మిగతా ఆలయాల్లో కూడా ఇదే తరహాలో బంగారు లేదా వెండి రధాలు అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. (Photos Courtesy: Raju, Chittoor Dist, TV9 Telugu)