
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు ప్రధాని మోదీ.. ఈ క్రమంలో ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ నేతలు అందరినీ ఆహ్వానించింది బీజేపీ పార్టీ.. దీంతో నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.. కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు నేతలు హాజరయ్యారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారణాసి చేరుకుని ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, అనా కొణిదెల కాశీ విశ్వనాధుని ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. వారి వెంట ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా ఉన్నారు.

ముందుగా.. కాశీ విశ్వనాధుని ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ దంపతులకు అర్చకులు ఆహ్వానం పలికారు. అనంతరం పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కాశీనాథుని ఆశీస్సులతో కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

కాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీచేస్తున్న విషయం తెలిసిందే.. కూటమిలో భాగంగా పవన్ పిఠాపురం నుంచి పోటీచేశారు. ఇక్కడ వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు.

ఈ సారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వస్తుందని.. మోదీ ప్రధాని ప్రమాణస్వీకారం చేస్తారని పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు.