నేటి జీవన విధానం వల్ల బయట జంక్ ఫుడ్ తినే ట్రెండ్ పెరిగింది. ఫలితంగా శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోతుంది. శరీరంలో ఇలా ఎక్కువ కాలం కొవ్వు పెరుకుపోతే లేనిపోని సమస్యలు వచ్చ పడతాయి. ఈ సమస్యను దూరం చేసుకుంటే ఊబకాయంతో బాధపడే అవకాశం తగ్గుతుంది. ఊబకాయం లేదా అధిక శరీర బరువు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 28 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోతే, నయం చేయలేని, సంక్లిష్ట వ్యాధుల బారిన పడే అవకాశం పెరుగుతుంది. అనియంత్రిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం ఇందుకు ప్రధాన కారణాలు. బరువు పెరగడం వల్ల హార్ట్ కాంప్లికేషన్స్ వస్తాయి. స్థూలకాయం వివిధ రకాల కార్డియోవాస్కులర్ సమస్యలతో ముడిపడి ఉంటుంది. ధమనుల గోడలపై అదనపు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభిస్తే, రక్తంలో 'చెడు' కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీంతో రక్త ప్రసరణ కష్టతరంగా మారుతుంది. ఫలితంగా గుండెపోటు సంభవం పెరుగుతుంది.
ఊబకాయం వల్ల చిన్న వయసులోనే మధుమేహం వచ్చే అవకాశం ఉంది. దీనిని టైప్ 2 డయాబెటిస్ అంటారు. శరీరంలోని అధిక కొవ్వు ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఆస్తమా ఊబకాయంతో సంబంధం కలిగి ఉంటుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుండి వచ్చిన గణాంకాల ప్రకారం.. ఆస్తమాతో లేనివారిలో 26.8 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆస్తమా రోగులలో ఈ సంఖ్య 38.8 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
ఊబకాయం రొమ్ము, పెద్దప్రేగు, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ క్యాన్సర్లతో సంబంధం కలిగి ఉంటుంది. మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత వంటి లక్షణాలు క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
శరీరంలో పెరిగే కొవ్వు కరిగిపోకపోతే వివిధ అవయవాలలో పేరుకుపోతుంది. ఈ కొవ్వు కాలేయంలో పేరుకుపోయినప్పుడు దాని నుండి అవసరమైన ఎంజైమ్ల స్రావం తగ్గుతుంది. ఇలా ఎక్కువ కాలం జరిగితే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది.