
ఆధునిక పోషకాహార శాస్త్ర పరిశోధనల ప్రకారం.. మెంతులలో పుష్కలంగా ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, జిగురు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జర్నల్ ఆఫ్ ఫుడ్ బయోకెమిస్ట్రీ అధ్యయనం ప్రకారం.. మెంతుల జిగురు జీర్ణాశయం, ప్రేగుల గోడలపై ఒక రక్షక పొరను ఏర్పరుస్తుంది. ఇది శరీరంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల కలిగే మంట, ఎసిడిటీ నుండి తక్షణ ఉపశమనాన్ని అందించి, ప్రేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

బరువును నియంత్రించడంలో, కొవ్వును కరిగించడంలో కూడా మెంతి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మెంతులలో ఉండే గెలాక్టోమన్నన్ అనే కరిగే పీచు పదార్థం పేగుల్లో జెల్ లాగా మారి, ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను స్లోగా చేస్తుంది. క్లినికల్ న్యూట్రిషన్ రీసెర్చ్ ప్రకారం.. ఇది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూసి అనవసర ఆహార కోరికలను కట్టడి చేస్తుంది. ఫలితంగా కొవ్వు జీవక్రియ వేగవంతమై, సహజంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రణలో మెంతి గింజల్లోని స్టెరాయిడల్ సాపోనిన్లు విశేషంగా సహాయపడతాయి. ఈ సహజ సమ్మేళనాలు కాలేయంలో కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి. రోజూ క్రమం తప్పకుండా మెంతి నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో హానికరమైన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు తగ్గి, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం తప్పుతుంది. తద్వారా గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది.

మధుమేహ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడానికి మెంతులు బాగా ఉపయోగపడతాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ పరిశోధనల ప్రకారం.. మెంతులలో ఉండే 4 హైడ్రాక్సీఐసోలూసిన్ అనే అరుదైన అమైనో ఆమ్లం క్లోమం నుండి ఇన్సులిన్ విడుదలను ప్రోత్సహిస్తుంది. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల ఆహారం తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి టాక్సిన్లను బయటకు పంపి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

ఈ సంజీవనిని తయారు చేసుకోవడానికి ఒక టీస్పూన్ మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని వడకట్టి తాగాలి. నానబెట్టిన గింజలను నమిలి తినడం వల్ల అదనపు పీచు అందుతుంది. అయితే మెంతులకు శరీరాన్ని వేడి చేసే స్వభావం ఉన్నందున వీటిని మితంగానే తీసుకోవాలి. తక్కువ రక్త చక్కెర సమస్య ఉన్నవారు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు దీనిని అలవాటు చేసుకోవడం మంచిది.