
ఆహారాన్ని ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తే, వేడి కారణంగా దానిలోని సోడియం అణువుల నిర్మాణం కొంత మారుతుంది. ఇది శరీరంపై అంతగా ప్రతికూల ప్రభావం చూపదు. కానీ, పైన చల్లుకునే పచ్చి ఉప్పు నేరుగా రక్తంలో కలుస్తుంది. దీనివల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధిక రక్తపోటు : పైన ఉప్పు వేసుకోవడం వల్ల రక్తంలో సోడియం పరిమాణం పెరిగి రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెపోటు (Heart Attack) స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఒకవేళ ఇప్పటికే బీపీ, హైపర్టెన్షన్, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే.. రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలో వైద్యులను అడిగి తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు.

కిడ్నీ సమస్యలు: శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపడానికి కిడ్నీలు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలంలో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. రక్తపోటు వల్ల కణాలలో ఇన్సులిన్ అందుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అలా మధుమేహానికి ముఖ్యకారణంగా మారుతున్నది.

ఎముకల బలహీనత: ఎక్కువ సోడియం తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా క్యాల్షియం అధికంగా బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల ఎముకలు గుల్లబారి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు శరీరంలో సోడియం ఎక్కువైతే నిద్ర పట్టదు, నిస్సత్తువగా ఉంటుంది, దాహం వేస్తుంటుంది, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

శరీరంలో వాపు: శరీరంలో నీరు నిలిచిపోవడం (Water Retention) వల్ల కాళ్లు, చేతులు వాపు రావచ్చు. ఫలితంగా ముఖం, పొట్ట, ఇతర శరీర భాగాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ఉప్పు మోతాదును క్రమంగా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, రోజుకు 5 గ్రాముల (ఒక టీస్పూన్) కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. ఉప్పుకు బదులుగా రుచి కోసం నిమ్మరసం, మిరియాల పొడి లేదా ఇతర మూలికలను వాడుకోవచ్చు. చిప్స్, పచ్చళ్లు, ప్యాక్ చేసిన ఆహారాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తగ్గించాలి. రుచి కోసం చేసే చిన్న తప్పు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉంది.