
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి, ఆరోగ్యంగా ఉండటానికి రాగి జావ ఒక అద్భుతమైన ఎంపిక. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఈ జావను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం రుచికరమైనదే కాదు, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

రాగి జావ తయారు చేయడానికి, ముందుగా ఒక రోజు ముందు రాత్రి రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తగినన్ని నీటిలో ఉండలు లేకుండా బాగా కలిపి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టి, అందులో ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి మరగనివ్వాలి.

నీళ్లు రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత, రుచికి సరిపడా ఉప్పు వేసి, రాత్రి నానబెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఒకసారి కలిపి మరుగుతున్న నీటిలో వేయాలి. ఉండలు కట్టకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి.

సుమారు 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత, జావ చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారకుండా, గోరువెచ్చగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.

ఈ రాగి జావను గ్లాసులోకి తీసుకుని, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయాలి.

ఈ ఆరోగ్యకరమైన, చలువ చేసే రాగి జావ వేసవిలో ఉత్తమ అల్పాహారం లేదా పానీయం.. అని.. బయట ఏది పడితే అది తినకుండా.. దీనిని తీసుకోవడం చాలా బెస్ట్ అని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..