
గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే కడుపు నొప్పి, విరేచనాలు వస్తాయి. అంతేకాదు.. గుమ్మడి గింజలు కొంతమందిలో బరువు పెరగడానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి విత్తనాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మోతాదుకు మించి తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

గుమ్మడి గింజలు అలెర్జీలను కలిగిస్తాయి. గొంతు నొప్పి, తుమ్ములు వస్తాయి. గొంతులో చికాకు, దగ్గుతోపాటు తలనొప్పికీ కారణం అవుతాయి. ఇంకొందరిలో చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిస్తే.. గుమ్మడి విత్తనాలను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి గింజల నీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. గుమ్మడి గింజల నీటిలో ట్రైటోఫాన్ ఉంటుంది. ఇది మంచి నిద్రకు చాలా అవసరం.

గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.మెదడు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో గుమ్మడికాయ గింజలు సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి.

ఇక పిల్లలకు చాలా తక్కువగా అందివ్వాలి. లేకుంటే.. కడుపునొప్పి, విరేచనాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి, పిల్లలతోపాటు పెద్దలు కూడా.. గుమ్మడి గింజలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. గుమ్మడి గింజలను మితంగా తినడం మంచిది. స్మూతీలు, సలాడ్లలో గుమ్మడి గింజలు కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.