
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఎనిమిదో మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్ రియాన్ రికెల్టన్ త్వరగా అవుట్ అయినప్పటికీ, రోహిత్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా కేవలం 26 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 35 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ ఆటగాడు కూపర్ కానలీని వెనక్కి నెట్టి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతున్న రోహిత్ శర్మ, ఐదుసార్లు ఛాంపియన్ కెప్టెన్గా నిలిచినప్పటికీ, ఎప్పుడూ ఆరెంజ్ క్యాప్ను ధరించలేదు. అయితే ఈ సీజన్ తొలి మ్యాచ్లో కోల్కతాపై 38 బంతుల్లో 78 పరుగులు చేసిన రోహిత్, ఇప్పుడు ఢిల్లీపై చేసిన 35 పరుగులతో కలిపి మొత్తం 113 పరుగులు సాధించాడు.

ప్రస్తుతం 56.50 సగటుతో ఉన్న రోహిత్, ఈ ఘనత సాధించడం ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. 38 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు ధీటుగా బ్యాటింగ్ చేస్తూ తాను ఇంకా అత్యుత్తమ ఫామ్లో ఉన్నానని నిరూపించుకున్నాడు.

గత 19 సీజన్లుగా ఐపీఎల్లో కొనసాగుతున్న రోహిత్ శర్మకు 2013 సీజన్ అత్యంత గుర్తుండిపోయేది. ఆ ఏడాదిలోనే ఆయన ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ సీజన్లో 19 ఇన్నింగ్స్ల్లో 538 పరుగులు సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో రోహిత్ 500 పరుగుల మార్కును దాటడం అదే తొలిసారి, అదే చివరిసారి. అప్పట్లో మైకేల్ హస్సీ ఆరెంజ్ క్యాప్ గెలవగా, రోహిత్ ఆరో స్థానంలో నిలిచారు. కానీ ఈసారి సీజన్ ఆరంభంలోనే క్యాప్ అందుకోవడం విశేషం.

హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టు స్కోరును 150 దాటించడంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్ అందించిన శుభారంభాన్ని సూర్య, నమన్ ధీర్ చక్కగా ఉపయోగించుకున్నారు. నిర్ణీత ఓవర్లలో ముంబై ఇండియన్స్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.