ముంబై టెస్టు రెండో రోజు టీమ్ ఇండియా విజయం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేసిన టీమిండియా కివీస్ను కేవలం 62 పరుగులకే ఆలౌట్ చేసి, రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. దీంతో 332 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ టెస్టులో విజయం సాధించడం పక్కా అని తెలుస్తోంది. రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ బ్యాటింగ్ నిరాశపరిచినా దాని స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు.
ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ తరఫున అజాజ్ పటేల్ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. టెస్టు ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన తొలి కివీస్ బౌలర్గా అజాజ్ పటేల్ నిలిచాడు. అదే సమయంలో, జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా అజాజ్ నిలిచాడు.
అజాజ్ పటేల్ సాధించిన ఈ విజయానికి ప్రపంచం మొత్తం సెల్యూట్ చేసింది. అదే సమయంలో, రెండో రోజు ఆట ముగిసిన తర్వాత, కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వయంగా న్యూజిలాండ్ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి అజాజ్ పటేల్ను అభినందించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి, కివీస్ డ్రెస్సింగ్ రూమ్లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ అజాజ్ పటేల్తో కరచాలనం చేస్తూ కనిపించాడు.
విరాట్ కోహ్లీ మాత్రమే కాదు.. తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా 150 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అతడిని అభినందించాడు. మయాంక్ కివీస్ బౌలర్ అజాజ్ని కౌగిలించుకున్నాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన ఆర్. అశ్విన్ కూడా ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసినందుకు అజాజ్ పటేల్ను అభినందించాడు. ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీయడం ప్రతి బౌలర్ కల అని, అజాజ్ దానిని సాధించాడని అశ్విన్ ట్వీట్ చేశాడు.