2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్లో జరగనుంది. అయితే, పాక్లో టోర్నీ ఆడేందుకు భారత జట్టు వెళ్లడం లేదని తెలుస్తోంది. అలాగే, టోర్నీని హైబ్రిడ్ ఫార్మాట్లో నిర్వహిస్తేనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే అవకాశం ఉంది.
ఇక్కడ హైబ్రిడ్ మోడల్ అంటే టోర్నమెంట్ పాకిస్థాన్లో జరిగినప్పటికీ తటస్థ వేదికలో భారత్ మ్యాచ్లను నిర్వహించడం అన్నమాట. దీని ప్రకారం, యూఏఈ లేదా శ్రీలంకలో భారత్ మ్యాచ్లను నిర్వహించాల్సిందిగా బీసీసీఐ ఐసీసీని అభ్యర్థించవచ్చు.
టోర్నీని హైబ్రిడ్ ఫార్మాట్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిరాకరిస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా వైదొలగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత జట్టు వైదొలగితే ఏ జట్టుకు అవకాశం దక్కుతుందనే ప్రశ్నలు రావడం సహజం.
ఈ ప్రశ్నకు సమాధానం శ్రీలంక. ఎందుకంటే, ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ODI ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్-8లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయి. అయితే, ఈ 8 జట్లలో శ్రీలంక లేదు.
ఇప్పటికిప్పుడు భారత జట్టు టోర్నీ నుంచి వైదొలగితే శ్రీలంక జట్టుకు అవకాశం దక్కుతుంది. ఎందుకంటే వన్డే ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో శ్రీలంక జట్టు 9వ స్థానంలో ఉంది. ఈ విధంగా టోర్నమెంట్ నుంచి ఒక జట్టును తొలగించినట్లయితే, పాయింట్ల పట్టికలో తదుపరి స్థానంలో ఉన్న జట్టు అనుమతి పొందనుంది. దీని ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత జట్టు వైదొలగితే శ్రీలంక జట్టు టోర్నీకి అర్హత సాధిస్తుంది.