
ఆడియన్స్ తెలివిమీరిపోయారు.. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ప్రమోషన్స్లో కనికట్టు చేస్తే రిజల్ట్తో గట్టిగానే బుద్ధి చెప్తున్నారు. ఈ మధ్య ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు ఇదే జరిగింది. బయట చెప్పేదొకటి.. సినిమాలో ఉన్నదొకటి..! ఈ రాంగ్ ప్రమోషన్తోనే హిట్ అవ్వాల్సిన సినిమాలు కూడా ఫట్ అన్నాయి. మరి ఏంటా సినిమాలు.. మేకర్స్ చేసిన ఆ తప్పేంటి..?

నిజమో.. అబద్ధమో.. ఉన్నదున్నట్లు ప్రమోషన్స్లో చెప్తే సినిమా చూడాలో లేదో అనేది ఆడియన్స్ నిర్ణయించుకుంటారు. కానీ బయట ఒకటి చెప్పాక.. సినిమాలో మ్యాటర్ మరోలా ఉంటే మాత్రం రిజల్ట్ దారుణంగా వస్తుంది. ఈ మధ్య కొన్ని సినిమాలకు ఇదే జరిగింది. గుంటూరు కారం కూడా దీనికి మినహాయింపు కాదు.. మదర్ సెంటిమెంట్ కాకుండా మాస్ సినిమాగా దీన్ని ప్రమోట్ చేసారు మేకర్స్.

గుంటూరు కారం మొదలైన రోజు నుంచి పక్కా మాస్ బొమ్మ అనే చెప్పారు దర్శక నిర్మాతలు. త్రివిక్రమ్ గత సినిమాలకు భిన్నంగా ఉంటుందన్నారు.. తీరా అదే మైండ్ సెట్తో థియేటర్స్కు వెళ్లిన ఆడియన్స్కు అక్కడ తేడా కొట్టింది. ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ ఒప్పుకున్నారు కూడా. ఇక వెంకటేష్ సైంధవ్ విషయంలోనూ ఇదే తప్పు చేసారు నిర్మాతలు.

శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాను ఫ్యామిలీ మూవీ అంటూ ప్రమోట్ చేసారు. యాక్షన్ ఉన్నా.. వెంకటేష్ అభిమానులకు కావాల్సిన సెంటిమెంట్ ఉంటుందన్నారు మేకర్స్. తీరా థియేటర్లోకి వెళ్లిన ఆడియన్కు తెర మీద పెద్ద మారణహోమమే కనిపించింది. దాంతో వెంటనే డిస్ కనెక్ట్ అయిపోయారు. రవితేజ ఈగల్ విషయంలోనూ రాంగ్ ప్రమోషన్ దెబ్బ తీసింది.

ఈగల్ సినిమాను మొదట్నుంచీ హాలీవుడ్ రేంజ్ స్టైలిష్ యాక్షన్ సినిమాలా ప్రమోట్ చేసారు.. కానీ చాలా భాగం ఊర మాస్ బొమ్మ. దానికి తోడు మితిమీరిన హింస ఈగల్పై ప్రభావం చూపించింది. గతేడాది స్పైలో నేతాజీ డెత్ సీక్రేట్ చెప్పామన్నారు.. కానీ సినిమాలో అలాంటిదేం లేదు. ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్లో కామెడీ ఉంటే.. యాక్షన్ అని ప్రమోట్ చేసారు. ఇలాంటి తప్పులే సినిమాల ఫేట్ మార్చేస్తున్నాయి.