
నార్త్ వాళ్ల చూపూ.. తెలుగు వైపు.. సౌత్లో మిగిలిన ఇండస్ట్రీల చూపూ.. తెలుగు వైపు.. అలాంటప్పుడు కొందరు హీరోయిన్లు మాత్రం తెలుగుకు దూరం దూరంగా ఎందుకు జరుగుతున్నారు? దూరమైతే ఏం వస్తుంది? అసలు ఆ దూరం వాళ్లు కోరుకున్నదేనా.. జస్ట్ అలా వచ్చేసిందా?

శ్రీలీల సినిమాలను ఎందుకు ఒప్పుకోవడం లేదు? స్పెషల్ సాంగ్ చేసిన పుష్ప2, హీరోయిన్గా నటించిన రాబిన్హుడ్ రిలీజ్ అయితే, ఉస్తాద్ భగత్సింగ్ తప్ప ఆమె చేతిలో ఇంకేం సినిమాలున్నాయి? అని అంటే మొన్న మొన్నటిదాకా ఆన్సర్ లేదు.. కానీ, తన చదువు కోసం గ్యాప్ తీసుకున్నట్టు అమ్మణి చెప్పేశాక.. ఓకే అని కుదుటపడ్డారు ఫ్యాన్స్. ఆమె సంగతి వదిలేయండి.. మిగిలిన వారు తెలుగుకు దూరంగా ఎందుకు ఉంటున్నారు?

అసలు పూజా హెగ్డేకి ఏమైంది అని ఆరా తీస్తున్నారు. పూజా చేతిలో హిందీ, తమిళ ప్రాజెక్టులున్నాయి కానీ, తెలుగు సినిమాలు లేవు. కీర్తీ సురేష్ కూడా అడపాదడపా అనువాద సినిమాలతో పలకరిస్తున్నారేగానీ, పెద్ద హీరోలతో తెలుగు మూవీస్ చేస్తున్న దాఖలాలు లేవు. అటు నయనతార కంప్లీట్గా తమిళ్లోనే చేస్తానని బౌండరీలు గీసుకున్నట్టు కనిపిస్తోంది.

రకుల్, రాశీఖన్నా ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసేవారు. ఏదో ఒక ప్రాజెక్టుతో తెలుగువారికి దగ్గరగా ఉండేవారు. కానీ ఇప్పుడు అనువాద సినిమాలతో కూడా పలకరించడం గగనమైపోయింది. సమంత నార్త్ లో ఏవో డిజిటల్ ప్రాజెక్టులు చేస్తున్నా.. తెలుగులో మా ఇంటి బంగారం ప్రాజెక్టును చూపిస్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చేస్తారంటే.. ఇప్పటికైతే నో ఆన్సర్.

యంగ్ హీరోయిన్లలో నజ్రియా, మమిత బైజు లాంటి మలయాళ హీరోయిన్లకు మన దగ్గర యమా క్రేజే వచ్చింది. కానీ వాళ్లెందుకో తెలుగు ప్రాజెక్టుల వైపు చూడట్లేదు. కృతి శెట్టి కూడా తెలుగు తప్ప అదర్ లాంగ్వేజెస్ మీద కాన్సెన్ట్రేట్ చేస్తున్నారు. నా కోసం సీతారామమ్ని మించిన సబ్జెక్టులను మేకర్స్ రెడీ చేయిస్తున్నారు. అలాంటి కాన్సెప్టులు వచ్చినప్పుడు తప్పక సినిమాలు చేస్తానంటున్నారు మృణాల్. విషయం ఏదైనా.. టాలీవుడ్కి కొందరు హీరోయిన్లు క్రమక్రమంగా దూరమవుతున్నారన్నదే నిజం.