
ప్యాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత ఏడాదికి ఒక్క సినిమా కాదు.. రెండు మూడేళ్లకు గానీ ఒక్కసారి కనిపించట్లేదు మన హీరోలు. ఇలాంటి టైమ్లోనూ ఏడాదికి రెండు సినిమాలు ఈజీగా చేస్తున్నారు ప్రభాస్.

ఆయన ప్లానింగ్కు మిగిలిన హీరోలంతా ఫిదా అవుతున్నారు. 2024లోనూ కల్కితో వచ్చిన ప్రభాస్.. 2025లోనూ 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్తో బిజీగా ఉన్నారు. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.

దీంతో పాటు హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్ వేగంగానే జరుగుతుంది. ఇది 2025 డిసెంబర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు తక్కువ గ్యాప్లోనే రానున్నాయి.

ఇక సంక్రాంతికి డాకూ మహరాజ్గా వచ్చిన బాలయ్య.. దసరాకు అఖండ 2తో రానున్నారు. ఎన్నికల కారణంగా 2024లో వచ్చిన బాకీని 2025లో తీర్చేస్తున్నారు NBK.

ఇక పవన్ కళ్యాణ్ కూడా అన్నీ కుదిర్తే 2025లో రెండు సినిమాలతో రావడం ఖాయం. ఇప్పటికే మే 9న హరిహర వీరమల్లు డేట్ ఖరారైంది. ఇక ఓజిని కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇది సెప్టెంబర్లో వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఫ్యాన్స్కు పండగే.

2025, మే 1న హిట్ 3తో వస్తున్న నాని.. 8 నెలలు తిరిగేలోపే మార్చి 26, 2026న ది ప్యారడైజ్తో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఆగస్ట్ 14న వార్ 2తో పలకరిస్తున్నారు. ఇదొచ్చిన 4 నెలల్లోనే.. సంక్రాంతికి ప్రశాంత్ నీల్ డ్రాగన్తో రానున్నారు. నాగార్జున సైతం 2025లో కుబేరా, కూలీ సినిమాలతో వస్తున్నారు.