
నటి పూనమ్ పాండే (32) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్తో పోరాడుతున్నారు పూనమ్ పాండే. సర్వైకల్ కేన్సర్కి తీసుకున్న చికిత్స ఫలించక కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో టీమ్ అఫిషియల్గా పోస్ట్ చేశారు.

''ఈ ఉదయం అత్యంత బాధాకరమైంది. పూనమ్ పాండే సర్వైకల్ కేన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ, ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో, ఎంత ప్రేమగా మాట్లాడేవారో తెలిసే ఉంటుంది. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిన కష్టతరుణంలో ప్రైవసీని కోరుకుంటున్నాం.

ఆమె జ్ఞాపకాలు మనందరిలోనూ పదిలంగా ఉన్నాయి'' అని పోస్ట్ చేశారు. 1991లో కాన్పూర్లో జన్మించారు పూనమ్ పాండే. మోడల్గా పేరు తెచ్చుకున్న ఆమె, హిందీలో నషా సినిమాతో ప్రేక్షకులను తొలిసారి పలకరించారు. ఆ తర్వాత భోజ్పురి, తెలుగు, కన్నడలో కూడా నటించారు.

2011లో జరిగిన ఇండియా వరల్డ్ కప్ సమయంలో ఆమె పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. భారతదేశం వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా నృత్యం చేస్తానని అప్పట్లో ఆమె ప్రకటించడమే అందుకు కారణం. అయితే అందుకు పబ్లిక్ అప్రూవల్ రాలేదనే ప్రచారం జరిగింది.

బీసీసీఐ తనకు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్లనే వెనుకంజ వేయాల్సి వచ్చిందని చెప్పారు పూనమ్. మాలిని అండ్ కో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె వెండితెర మీద చివరిసారి కనిపించింది ది జర్నీ ఆఫ్ కర్మ చిత్రంలోనే.

కోవిడ్ టైమ్లో వివాహం చేసుకున్న ఆమె, 2022లో లాకప్ షోలో కంటెస్టంట్గా పాల్గొన్నారు. ఇటీవల అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన సమయంలోనూ జైశ్రీరామ్ అంటూ స్పందించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే పూనమ్ పాండే మరణ వార్తను ఇలా సోషల్ మీడియా హ్యాండిల్లో చూడటం బాధాకరమని నివాళులు అర్పిస్తున్నారు పూనమ్ అభిమానులు.