
దర్శకుల రేంజ్ పెరిగింది అంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్న రెమ్యునరేషనే స్థాయి చూపిస్తున్నాయి. కొందరైతే వందల కోట్లు పారితోషికం అందుకుంటున్నారు. అందులో రాజమౌళి ఆద్యుడు. ఇక ఆయన్ని సుకుమార్, త్రివిక్రమ్, అట్లీ, సందీప్ వంగా లాంటి దర్శకులు అనుసరిస్తున్నారు. వీళ్ళ పారితోషికం స్టార్ హీరోలకేం తక్కువ కాదు.

రాజమౌళికి రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాత తెలుగులో లేరు. అందుకే బాహుబలి, ట్రిపుల్ ఆర్కు షేర్ తీసుకున్నారీయన. అది లెక్కేస్తే జక్కన్న రెమ్యునరేషన్ ఏ 200 కోట్లో వస్తుంది.. అంతకంటే ఎక్కువున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక పదేళ్లుగా త్రివిక్రమ్ కూడా హారిక హాసినిలో షేర్ తీసుకుంటున్నారు.

సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 నిర్మాణంలో భాగం అయ్యారు. పుష్పకు భారీగానే పారితోషికం అందుకున్న లెక్కల మాస్టారు.. పార్ట్ 2కు నిర్మాతయ్యారు. దాంతో బిజినెస్లోనే వాటా తీసుకోబోతున్నారు సుక్కు. ఈ లెక్కన ఆయన పారితోషికం 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

అట్లీ సైతం అల్లు అర్జున్ సినిమా కోసం ఏకంగా 60 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. జవాన్తో ఈయన రేంజ్ బాగా పెరిగిపోయింది. అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ 120 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. అందులో సగం అట్లీ ఛార్జ్ చేస్తున్నారు.

అలాగే యానిమల్ బిజినెస్లో వాటా తీసుకున్నారు సందీప్. ఆ సినిమా 800 కోట్లు వసూలు చేసింది.. అంటే సందీప్ వంగా వాటా కనీసం 100 కోట్లైనా ఉంటుందనేది ఓ అంచనా. లోకేష్ కనకరాజ్ సైతం సినిమాకు 50 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. వీళ్లంతా ఇప్పుడు హీరోలకే షాక్ ఇస్తున్నారు.