
మాడు పగిలే ఎండలు హడలెత్తిస్తున్నా.. చాలా ప్రదేశాల్లో మాత్రం దోమల బెడద మరింతగా పెరిగింది. దీంతో మళ్లీ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. డెంగ్యూ జ్వరం సోకితే రక్తంలో ప్లేట్లెట్స్ స్థాయి ఘణనీయంగా తగ్గుతుంది. ప్లేట్లెట్ స్థాయిలు మితిమీరి పడిపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది.

డెంగ్యూ వ్యాధి వల్ల రక్తంలో ప్లేట్లెట్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో వివిధ విటమిన్లు, ఖనిజాలు తగినంత మొత్తంలో ఉంటేనే రక్తంలో ప్లేట్లెట్స్ స్థాయి సక్రమంగా ఉంటుంది. డెంగ్యూ వ్యాధి బారీన పడిన వారు వైద్యుల సలహా మేరకు కొన్ని మందులతో పాటు కొన్ని ఆహారాల ద్వారా కూడా రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.

బొప్పాయి ఆకు రసం బ్లడ్ ప్లేట్లెట్ స్థాయిలను పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బొప్పాయి రసంలో ఎంజైమ్లు ఉంటాయి. ఇవి ప్లేట్లెట్ స్థాయిలను వేగంగా పెంచడంలో సహాయపడతాయి.

రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడంలో ఉసిరి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉసిరి రసంలో విటమిన్-సి అధిక స్థాయిలో ఉంటుంది. కాబట్టి రోజూ ఉసిరికాయ రసం తాగడం వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ స్థాయి వేగంగా పెరుగుతుంది.

పాలకూరతోపాటు ఇతర ఆకు పచ్చని ఆకు కూరల్లో తగిన మొత్తంలో B విటమిన్లు, B12 విటమిన్లు ఉంటాయి. ఆకు కూరలను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ స్థాయి పెరుగుతుంది.