Athi Madhuram Veru : ఆయుష్షుని పెంచే అతిమధురం..! ఇలా వాడితే.. అనేక వ్యాధులకూ చెక్పెట్టే రామబాణం..
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. అందులో కొన్ని మనకు తెలిసినవి. కొన్ని తెలియనివి అనేకం ఉన్నాయి. అలాంటి ఔషధ మొక్కల్లో అతి మధురం కూడా ఒకటి. ఆయుర్వేదంలో ఈ మొక్క వేరును విరివిరిగా ఉపయోగిస్తారు. ఈ మొక్క 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్కకు ఉండే అతి తీపి కారణంగా దీనికి అతి మధురం అనే పేరు వచ్చింది. అతి మధురం వేరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
Updated on: Mar 12, 2024 | 12:04 PM

విరోచనాలు సాఫీగా అయ్యేలా చేయడంలో అతి మధురం మంచి మందులా పనిచేస్తుంది. దగ్గును తగ్గించడంలో కూడా ఈ అతి మధురం వేరు మనకు సహాయపడుతుంది. కడుపులో పుండ్లను తగ్గించడంలో అతి మధురం వేరు ఎంతగానో ఉపయోగపడుతుంది. అతి మధురం చూర్ణాన్ని ఒకటి లేదా రెండు గ్రాముల మోతాదులో పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు, హైపర్ ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.

చర్మ సౌందర్యాన్ని పెంచడంలో అతి మధురం ఎంతో మేలు చేస్తుంది. అతి మధురం వేర్లను పాలు, కుంకుమ పువ్వుతో కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి.

అతిమధురం వేరు చూర్ణాన్ని అర టీ స్పూన్ మోతాదులో నీటిలో వేసి కషాయంలా చేసుకుని తాగాలి. అలాగే అన్నాన్ని మెత్తగా వండుకుని తింటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల అల్సర్లు తగ్గుతాయి. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు, గొంతు శ్రావ్యంగా లేనప్పుడు, కఫం తొలగిపోకుండా దగ్గు వస్తూ ఉన్నప్పుడు అతి మధురం చూర్ణాన్ని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అతి మధురం చూర్ణాన్ని అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఈ విధంగా తయారు చేసుకున్న కషాయాన్ని గోరు వెచ్చగా అయిన తరువాత నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటిపూత తగ్గుతుంది.

చిటికెడు అతి మధురం చూర్ణానికి తేనెను కలిపి చప్పరించి మింగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే మలబద్దకం సమస్యను తగ్గించడంలో కూడా అతి మధురం మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఒకటి లేదా రెండు గ్రాముల అతి మధురం వేరు పొడిని 3 లేదా 5 గ్రాముల బెల్లంతో కలిపి ఉండలా చేసుకుని తినాలి.

మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు, రక్తపోటు ఉన్న వారు దీనిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.





























