
ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది జనసేన అజెండా, భారతీయ జనతా పార్టీది కూడా అదే అజెండా అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి అన్ని కోణాల నుంచి లోతుగా చర్చించామని అన్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన చాలా బలమైన సత్ఫలితాలను ఇస్తుందనే నమ్ముకం ఉందని తెలిపారు. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు. దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాటు బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి, కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ పాల్గొన్నారు.
సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “ఏపీకి సంబంధించి స్థిరత్వం ఉండాలని మొదటి నుంచి కోరుకుంటున్నామన్నారు. వైసీపీ నాయకుల అవినీతి, అరాచకాలపై చర్చించాం. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తాం. పొత్తుల గురించి సమావేశంలో చర్చకు రాలేదు.. రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం అవ్వాలి, అధికారం ఎలా సాధించాలి అనే అంశాలపై మాత్రమే చర్చించాం” అన్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రానికి మంచి జరుగుతుంది: నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాజకీయ కోణం నుంచి కాకుండా అభివృద్ధి కోణం నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం సహకరించుకొని పని చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది చాలా మంచి పరిణామం. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మంచి జరుగుతుందనే నమ్మకం ఈ రెండు రోజుల ఢిల్లీ పర్యటన వల్ల కలిగింది. జేపీ నడ్డాతోపాటు అనేక మంది బీజేపీ పెద్దలను కలిసి మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఈ విషయం అర్ధమైంది” అంటూ నాదెండ్ల తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..