Building Collapsed Video: నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల భవనం ఎలా కూలిందో చూడండి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

|

Oct 23, 2024 | 8:00 PM

బెంగళూరు నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న 4 అంస్థుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద సమయంలో సీసీటీవీలో అక్కడి దృశ్యాలు రికార్డయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని ఐదుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు..

Building Collapsed Video: నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల భవనం ఎలా కూలిందో చూడండి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Building In Bengaluru Collapsed
Follow us on

బెంగళూరు, అక్టోబర్‌ 23: కర్ణాటక రాజధాని బెంగళూరులో భరీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ధాటికి నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం ఒకటి మంగళవారం (అక్టోబర్‌ 22) కుప్పకూలిన సంగతి తెలిసిందే. భవనంలో కూలీలు పనిచేస్తుండగానే ఒక్కసారిగా కూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని హొరమావు అగార ఏరియాలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో పలువురు కూలీలు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. కనీసం 20 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం 4.10 గంటలకు కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేసినట్లు అగ్నిమాపక, ఎమర్జెన్సీ సర్వీస్‌ వర్గాలు తెలిపాయి. వెంటనే బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. హెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజనాద్రి లేఅవుట్‌లో ఉన్న ఆరు అంతస్తుల భవనం శిథిలాల నుంచి ఇప్పటివరకు 14 మందిని రక్షించారు. అలాగే మంగళవారం రాత్రి నాటికి మూడు మృత దేహాలను పోలీసులు వెలికి తీశారు. ఈ రోజు ఉదయం మరో రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

ఘటనా స్థలంలో భవన శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హన్నూరు పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. భవనం యజమాని మునిరాజరెడ్డి, మోహన్‌రెడ్డి, ఏలుమలై అనే వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేసినట్లు హన్నూర్‌ పోలీసులు తెలిపారు. బృహత్‌ బెంగళూరు మహానగర పాలక సంస్థ చట్టంలోని వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసిట్లు తెలిపారు. భవన యజమాని మునిరాజరెడ్డి కుమారుడు భువన్‌రెడ్డి, కాంట్రాక్టర్‌ యునియప్ప పోలీసుల అదుపులో ఉన్నారని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.